అడిలైడ్: భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వరల్డ్ కప్ కంటే ఎక్కువేనని పాకిస్తాన్కు చెందిన షోయబ్ అక్తర్ రెండు రోజుల క్రితమే చెప్పాడు. ఈ ప్రపంచ కప్లో కూడా దాయాదులు మ్యాచ్ పైనే డిబేట్ సాగుతోంది.
14న మొదలయ్యే మెగా ఈవెంట్ కోసం ఆయా జట్లు వ్యూహరచనల్లో మునిగిపోయాయి. అయితే అందరి దృష్టి 15న జరిగే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పైనే ఉంది. ఈ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు కేవలం 20 నిమిషాల్లో అయిపోయాయి. దీంతో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానుల ఆతృత ఎంతగా ఉందో అర్థమవుతోంది.
ఈ ఆటను వంద కోట్ల మందికి పైగా చూస్తారని అంచనా. అయితే ప్రపంచ కప్లో పాకిస్తాన్తో తలపడిన ప్రతిసారి భారత్ విజయం సాధించింది. ఈసారి భారత రికార్డులకు పాక్ బ్రేక్ వేయాలనే పట్టుదలతో ఉంది. గత రికార్డులను మరింత పదిలం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
మాజీ ప్లేయర్లు పాక్ జట్టులో ఆత్మవిశ్వాసం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఓడిపోతామనే భావనతో బరిలో దిగవద్దని మాజీ కెప్టెన్ ఇంజమామ్ సూచించాడు. పాక్ మాజీ స్పిన్నర్ అబ్ధుల్ ఖాదిర్ ఇండో పాక్ మ్యాచ్ను ఫైనల్ కాని ఫైనల్ మ్యాచ్గా అభివర్ణించాడు.