వేలాది మంది అభిమానులు
వియత్నాం ప్రొఫెషనల్ లీగ్లో భాగంగా నామ్దిన్హ్ స్టేడియంలో నిర్వహించిన తొలి మ్యాచ్కు వేలాది మంది ఫుట్బాల్ అభిమానులు తరలివచ్చారు. వారంతా సామాజిక దూరం పాటించకుండా.. పక్కపక్కనే కూర్చున్నారు. ఒకర్నొకరు తాకుకుంటూ మ్యాచ్ను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేసారు. 30 వేలలో కొద్ది మంది మాత్రమే ముఖానికి మాస్క్లు వేసుకున్నారు. కాగా అధికారులు కూడా స్టేడియంలో అభిమానులు భౌతిక దూరం పాటించేలా ఎలాంటి మార్కింగ్లు కూడా ఏర్పాటు చేయనట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్లో వియట్టెల్ జట్టు 2-1 తేడాతో ఆతిథ్య జట్టుపై విజయం సాధించింది.
వైరస్కు భయపడితే ఇక్కడికి వచ్చేవాళ్లం కాదు
అయితే మ్యాచ్ చూడటానికి వచ్చిన అభిమానులకు థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు, శానిటైజేషన్ చేసినట్లు స్టేడియం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఓ ఫుట్బాల్ అభిమాని మాట్లాడుతూ... 'ఇన్ని రోజులు ఫుట్బాల్ మ్యాచ్ చూడకుండా ఉండలేకపోయా. వైరస్కు భయపడితే ఇక్కడికి వచ్చేవాళ్లం కాదు. కరోనా భయం ఉంటే మ్యాచ్లు చూడటానికి రాకండి, అంతేకాని మ్యాచ్లు జరగకుండా అడ్డుకోకండి. వైరస్ను ఎదుర్కోడానికి తీసుకున్న చర్యలు బాగున్నాయి. అందుకే ప్రతీఒక్కరూ ఈ మ్యాచ్ను ఆస్వాదిస్తున్నారు' అని తెలిపాడు.
ప్రేక్షకులతో నిండిపోవడం చాలా సంతోషం
మ్యాచ్ అనంతరం వియత్నాం జట్టు కెప్టెన్ క్యూహాయ్ మాట్లాడుతూ... 'స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మా దేశాన్ని ఇతర దేశాలతో పోల్చడం సరికాదు. అయితే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వియత్నాం విజయవంతమైంది. దీంతోనే ఫుట్బాల్ ఆట మళ్లీ ప్రారంభమైంది. ఈ ఆట ద్వారా.. మా దేశం మహమ్మారిని ఎంత సమర్థవంతంగా ఎదుర్కొందనే విషయం తెలుస్తుంది' అని అన్నాడు.
ఒక్క మరణం కూడా లేదు
కరోనా వైరస్ వ్యాప్తి మొదటిలోనే వియత్నాం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసి.. ఇతరులను అనుమతించలేదు. లాక్డౌన్ పటిష్ఠంగా అమలు చేసి కేసుల సంఖ్య పెరగకుండా చూసుకుంది. మార్చిలో వియత్నం లీగ్ మ్యాచ్లు నిలిపివేసింది. 328 పాజిటివ్ కేసులలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. ఇప్పుడిప్పుడే సాధారణ జీవనశైలికి ప్రజలు అలవాటు పడుతున్నారు. ఇక స్టేడియాలకు వేల సంఖ్యలో అభిమానులను అనుమతించి కరోనాను సంపూర్ణంగా ఎదుర్కొన్నామనే విషయాన్ని పరోక్ష్యంగా తెలిపింది.