హైదరాబాద్: ప్రపంచకప్ ఫుట్బాల్ను ప్రత్యక్షంగా తిలకించడమే గొప్ప అనుభూతి అనుకొంటే.. ఇక అందులో పాల్గొనే జట్లతోపాటు కలిసి నడిస్తే... అదొక కొత్త అనుభూతి. ఇప్పుడు అలాంటి అరుదైన అవకాశం మన దేశంలోని ఇద్దరు చిన్నారులకు దక్కింది. రష్యాలో జరగనున్న ప్రపంచకప్లో రిషితేజ్, నతనియా జాన్ కనిపించనున్నారు. మ్యాచ్ ఆరంభానికి ముందు అధికారిక బంతిని వీళ్లు మైదానంలోకి తీసుకురానున్నారు.
కర్ణాటకకు చెందిన పదేళ్ల రిషి తేజ, తమిళనాడుకు చెందిన 11 సంవత్సరాల నాటానియా కె.జాన్. రష్యాలో జరిగే ఫిఫాక్పలో వీరిద్దరూ రెండు మ్యాచ్లకు అఫీషియల్ బాల్ క్యారియర్స్ (ఓఎంబీసీ, మ్యాచ్లో ఆడే బంతిని మైదానంలోకి తీసుకురావడం)వచ్చే వారిగా ఎంపికయ్యారు.
వీరిలో ఒకరు బెల్జియం-పనామా మ్యాచ్కు, మరొకరు బ్రెజిల్-కోస్టారికా మ్యాచ్కు ఆయా జట్లతో కలిసి నడుస్తూ బంతిని స్టేడియంలోకి తీసుకొని వెళతారు. ఫిఫా ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 64 మంది పాఠశాల విద్యార్థులను ఎంపిక చేస్తే మన దేశం నుంచి వీళ్లిద్దరూ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నారు. భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి ట్రయల్స్ నిర్వహించి వీరిని ఎంపిక చేశాడు.
'పిల్లల్లో ఇలాంటి నైపుణ్యాలు చూడడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు' అని ఛెత్రి తెలిపాడు. భారత్లో జరిగిన ఈ పోటీకి 1600మంది పోటీపడడం విశేషం.