హైదరాబాద్: జగజ్జేత ఫ్రాన్స్.. స్వదేశంలో అడుగుపెట్టడంతో సంబరాలు అంబరాన్నంటాయి. రోడ్లపై.. వీధుల గుండా.. వేల సంఖ్యలో జనం గుమిగూడి ఆటగాళ్లకు స్వాగతం పలికారు. ఈ వేడుకలు అన్ని చోట్ల సుఖాంతంగా ముగియలేదు. దేశంలోని పలు ప్రాంతాల్లో అల్లరి మూకలు విధ్వంసానికి దిగాయి. తమ ఆటగాళ్లు పరేడ్ చేసే చాంప్స్ ఎలిసీస్ ప్రాంతం మొత్తం ఆదివారం రణరంగంగా మారింది. కొందరు అక్కడి దుకాణాలను లూటీ చేయడమే కాకుండా పొగ బాంబులు విసిరారు.
30 మందికిపైగా యువకులు మాస్కులు ధరించి దుకాణంలోని షాంపేన్లు, వైన్ బాటిళ్లను ఎత్తుకెళ్లారు. టియర్ గ్యాస్ను ప్రయోగించిన పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఒక్క పారిస్లోనే 4 వేల మంది పోలీసులు మోహరించారు. దేశవ్యాప్తంగా 300 మందిని అరెస్ట్ చేశారు. మరోవైపు మ్యాచ్ ముగియగానే సంబరాల్లో ఒళ్లు తెలియక 50 ఏళ్ల వ్యక్తి పక్కనే ఉన్న కెనాల్లో దూకాడు. దీంతో అతని మెడ విరిగి మృతి చెందాడు.
అలాగే మరో యువకుడు సంబరాలు ముగించుకుని ఇంటికి తిరుగుప్రయాణంలో.. అతను నడుపుతున్న కారు చెట్టుకు ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు. ఒకరి బైక్ ఢీకొనడంతో ముగ్గురు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.
అయితే, ఆటగాళ్లు కూడా సంబరాల్లో మితిమీరి ప్రవర్తించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ విజయానంతరం ఫ్రాన్స్ ఆటగాళ్లు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, కోచ్లు నిబంధనల ప్రకారం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఫ్రాన్స్ జట్టు కోచ్ దిదియర్ డెచాంప్స్ ప్రసంగించేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఆటగాళ్లు ఒకరిపై ఒకరు షాంపేన్ చల్లుకుంటూ సందడి చేశారు. టేబుళ్లు ఎక్కి చిందులు వేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. చొక్కాలు విప్పేసి నానా రభస చేశారు.