హైదరాబాద్: మంగళవారం ఉదయం బొలివియా నుంచి కొలంబియాలోని మెడిలిన్స్ విమానాశ్రయానికి వెళ్తున్న ఓ విమానం కుప్పకూలి 81 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో బ్రెజిల్కు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు కూడా మృత్యువాత పడ్డారు.
ఈ ప్రమాదాన్ని ప్రపంచ పుట్బాల్ చరిత్రలోనే ఘోరమైన ప్రమాదంగా అభివర్ణిస్తున్నారు. వివరాల్లోకి వెళితే బ్రెజిల్ చాపికోయన్స్ ఫుట్ బాల్ టీంను తీసుకువెళుతున్న విమానం ఇంధన కొరత కారణంగా కొలంబియాలో కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు.
కూలిన విమానం: బ్రెజిల్ ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్లతోపాటు 81మంది
ప్రమాద సమయంలో విమానంలో 72మంది ప్రయాణికులు.. 9 మంది విమాన సిబ్బంది ఉన్నారు. స్ధానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 10.15 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని మెడిలిన్స్ విమానాశ్రయ అధికారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కోపా సుదామెరికన్ ఫైనల్స్లో భాగంగా బుధవారం అట్లెటికో నసియోనల్తో తలపడేందుకు బ్రెజిల్ చాపికోయిన్స్ ఫుట్బాల్ జట్టు బయల్దేరింది. పర్వత ప్రాంతాల్లోకి వెళ్లాక విమానానికి రాడార్ సంబంధాలు తెగిపోయాయని మెడిలిన్స్ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.
ఈ విమాన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలతో బయపడ్డారని స్థానిక మీడియా కథనాలు వెలువరించింది. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పుట్బాల్ ఆడేందుకు బయల్దేరిన ఆటగాళ్లు ఇలా విమాన ప్రమాదంలో మృతి చెందడం అందర్నీ కలిచివేసింది. పుట్ బాల్ ఆటగాళ్ల మృతిపై నెటిజన్లు ట్విట్టర్లో నివాళి అర్పించారు.