
డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్కు ఖతర్ పెద్దగా కలిసిరానట్లుంది. అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్ చేరినప్పటికీ.. నాకౌట్స్ చేరినప్పటి నుంచి ఈ జట్టుు షాకుల మీద షాక్లు తగులుతూనే ఉన్నాయి. సెమీఫైనల్ ముందే కొందరు కీలక ఆటగాళ్లు అనారోగ్యంతో జట్టుకు దూరమయ్యారు. ఇప్పుడు అర్జెంటీనాతో ఫిఫా వరల్డ్ కప్ 2022 ఫైనల్ ఆడటానికి రెండ్రోజుల ముందే ఆ జట్టులోని మరో ముగ్గురు ఆటగాళ్లు అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆ జట్టు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫ్రాన్స్ ఆటగాళ్లలో రఫేల్ వారానే, ఇబ్రహీం కొనాటే, కింగ్స్లీ కొమన్ ముగ్గురిలో వైరల్ ఫ్లూ లక్షణాలు కనిపించాయి. దీంతో వాళ్లు ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొనలేదు.
వైరల్ ఫీవర్ వంటి లక్షణాలతో కోమన్ ఇప్పటికే ఒక ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనలేదని ఫ్రెంచ్ పుట్బాల్ ఫెడరేషన్ (ఎఫ్ఎఫ్ఎఫ్) వెల్లడించింది. మొరాకోతో ఫ్రాన్స్ ఆడిన సెమీఫైనల్లో కూడా కోమన్ను సబ్స్టిట్యూట్గా పంపాలని మేనేజర్ డిడియర్ డెస్చాంప్స్ అనుకున్నాడు. కానీ ఈ సబ్స్టిట్యూషన్ను ఉపయోగించుకోలేదు. అయితే వరానే, కొనాటేల అనారోగ్యం మాత్రం డెస్చాంప్స్కు తలనొప్పిగా మారనుంది. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్రాన్స్ మిడ్ఫీల్డ్లో చాలా కీలకమైన ఆటగాళ్లు. మొరాకోతో మ్యాచ్లో వీళ్లు అద్భుతంగా ఆడారు.
మరో ప్లేయర్ డాయట్ ఉపామెకానో కూడా అనారోగ్యంతో జట్టుకు దూరమవడంతో సెమీఫైనల్లో అతని స్థానంలో కొనాటే రంగంలోకి దిగి అద్భుతంగా రాణించాడు. అంతకుముందే ఫ్రాన్స్ మిడ్ఫీల్డ్లో కీలకమైన ఆటగాడు ఆడ్రియన్ రాబియాట్ కూడా అనారోగ్యంతో జట్టుకు దూరమయ్యాడు. దీనిపై ఫ్రాన్స్ ఫార్వార్డ్ రాండల్ కోలో మోనీ మాట్లాడుతూ.. 'జట్టు ఆటగాళ్ల మధ్య ఫ్లూ వంటి వ్యాధి వ్యాపిస్తున్నట్లు కనిపిస్తోంది' అని చెప్పాడు. ఇలా ఇంత మంది కీలకమైన ఆటగాళ్లు అనారోగ్యం పాలవడంతో ఫ్రాన్స్ విజయావకాశాలు దెబ్బతినే అవకాశం ఉంది. అర్జెంటీనా వంటి బలమైన జట్టుతో ఫైనల్ ఆడే ముందు ఫ్రాన్స్కు ఈ సమస్య మరింత పెద్ద భూతంలా మారింది.