కోల్కతా: తమ జట్టు సారధి డియాగో ఫోర్లాన్ గైర్హాజరీలోనూ ముంబైలో జరిగే రెండో సెమీ ఫైనల్స్ మ్యాచ్లో విజయం సాధించగలమని ముంబై సిటీ ఎఫ్ సి హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ విశ్వాసం వ్యక్తంచేశాడు. శనివారం కోల్కతాలో అట్లెటికో డీ కోల్కతాతో జరిగిన తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్లో ఫోర్లాన్ రెడ్కార్డ్ను ఎదుర్కొని బెంచ్కు పరిమితమైన సంగతి తెలిసిందే. ఫోర్లాన్ వైదొలిగిన తర్వాత ముంబై జట్టు కోల్ కతా చేతిలో 2 - 3 స్కోర్ తేడాతో పరాజయం పాలైంది.
'మేం ఒక ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. కానీ మా టీం ఫోర్లాన్ లేకున్నా అద్భుతంగా ఆడగల సామర్థ్యం కలిగి ఉంది. ఈ తరహా మ్యాచ్లు విభిన్నంగా ఉంటాయి. ఇది మాకు ఒక గుణపాఠం కానున్నది. ఒక ప్లేయర్ తన అనువైన సమయం కోసం వేచి చూస్తుంటాడు. ఆ సమయం వచ్చినప్పుడు మెరుగైన ఆట ఆడతాడు' అని మీడియాతో అన్నాడు. ముంబైలో మ్యాచ్ ముగిసిన తర్వాత తాను స్పందిస్తానన్నాడు. ఫోర్లాన్ స్థాయి అటాకింగ్ ప్లేయర్ ను ఆయన స్థానంలో భర్తీచేసేందుకు సరిపడా ప్లేయర్లు అందుబాటులో ఉన్నారన్నాడు.

మా లక్ష్యం పూర్తి కాలేదన్న మొలీనా
ముంబైతో జరిగిన మ్యాచ్ తో తమ జాబ్ పూర్తి కాలేదని కోల్ కతా కోచ్ జోస్ మొలీనా చెప్పాడు. తదుపరి ఫైనల్స్ బెర్త్ సాధించడమే తమ లక్ష్యమన్నాడు. 'మా జాబ్ పూర్తి కాలేదు. ఈ నెల 18న కోచిలో జరిగే ఫైనల్స్ లో అడుగు పెట్టడమే మా లక్ష్యం' అని చెప్పాడు. 'సెకండాఫ్లో ముంబై సారధి డియాగో ఫోర్లాన్ పంతానికి పోయి జువెల్ రాజాను అడ్డుకోవడంతో గాయపడ్డాడని కోల్ కతా కోచ్ జోస్ మొలీనా పేర్కొన్నాడు.
'నేను నా టీంపై విశ్వాసంతో ఉన్నా. మేం ఒక గోల్ ఆధిక్యం కలిగి ఉన్నాం. ప్రత్యర్థి జట్టు సారధి మ్యాచ్ ఆడలేదు' అని చెప్పాడు. 'ఫోర్లాన్ పంతానికి పోయి జువెలా రాజాను అడ్డుకోవాల్సింది కాదు' అని అన్నాడు. ఆయన స్థాయికి ఇటువంటి వ్యవహారశైలి సరి కాదన్నాడు. 'బంతితో మాకు చాలా అవకాశాలు వచ్చాయి. ఎడమవైపు దౌటీ, కుడివైపు రాల్టే ఉన్నారు. కానీ మేం అలా చేయలేదు. ముంబైతో మరో 90 నిమిషాల మ్యాచ్ ఆడాల్సి ఉంది' అని మొలీనా వ్యాఖ్యానించాడు. తొలుత లాల్రిండికా రాల్టే, తర్వాత ఇయాన్ హుమ్ డబుల్ గోల్స్ తమ జట్టుకు ఆధిక్యం సాధించి పెట్టాయన్నాడు. తమ జట్టు ప్రదర్శన పట్ల హ్యాపీగా ఉన్నట్లు తెలిపాడు.
'ముంబైతో జరిగే మ్యాచ్ మాత్రమే మాకు ముఖ్యం. ఆటతీరులో మా జట్టు విశ్వాసంతో ఉంది. మేం మౌనంగా ఉంటూ ముందుకు సాగడంతోనే ముంబైపై ఒత్తిడి తేగలం' అని చెప్పాడు. స్టార్ గోల్ కీపర్ దేబ్జిత్ మజుందార్ సహా ఆరుగురు ప్రధాన ఆటగాళ్లను పక్కకు తప్పించడంపై స్పందిస్తూ 'అదేమంత పెద్ద విషయం కాదు. ప్రబీర్, ప్రీతంలలో ఎవరు ఆడుతున్నారన్నది సమస్య కాదు. ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు' అని అన్నాడు. అర్నాబ్ గాయం కారణంగా మ్యాచ్ కు దూరంగా ఉన్నాడన్నాడు. తదుపరి మ్యాచ్ లో మెరుగైన ఆటతీరు ప్రదర్శించే 11 మంది జట్టుతో బరిలోకి దిగుతామని చెప్పాడు.
బగాన్, ఈస్ట్ బెంగాల్ అధికారులకు జరిమానా
కోల్కతా సిటీ ఫుట్ బాల్ జెయింట్స్ మొహున్ బగన్ అసిస్టెంట్ కార్యదర్శి శ్రీన్జోయ్ బోస్, ఆర్థిక కార్యదర్శి దేబాషిస్ దత్తాపై రూ.లక్ష అపరాధ రుసుము విధించారు. గత సెప్టెంబర్ ఏడో తేదీన కలకత్తా ఫుట్ బాల్ లీగ్ (సిఎఫ్ఎల్)లో ఆడనందుకు ఒక్కొక్కరు రూ. లక్ష పరిహారం చెల్లించాలని అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) క్రమశిక్షణా కమిటీ (ఐఎఫ్ఎ) నిర్ణయం తీసుకున్నది. ఈస్ట్ బెంగాల్ ఎగ్జిక్యూటివ్ దేబబ్రత సర్కార్ పై రూ.25 వేల జరిమానా విధించింది. సర్కార్ తోపాటు ఈస్ట్ బెంగాల్ ప్రధాన కార్యదర్శి కల్యాణ్ మజుందార్ వ్యాఖ్యల తర్వాత మొహున్ బగన్ వాకోవర్ ప్రకటించడమే దీనికి కారణం.
అట్లెటికో మాడ్రిడ్ కొత్త స్టేడియం పేరు వండా మెట్రోపాలిటానో
మాడ్రిడ్: స్పానిష్ ఫుట్బాల్ లీగ్ 'లా లీగ' ప్రధాన టీంల్లో ఒక్కటైన అట్లెటికో మాడ్రిడ్ జట్టు కొత్త స్టేడియంను సంపాదించుకున్నది. శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో కోచింగ్ స్టాఫ్ తోపాటు క్లబ్ అధ్యఓుడు ఎన్రింకో సెరెజో కొత్త స్టేడియం పేరు వెల్లడించారు. ఇక నుంచి తమ స్టేడియంను వాండా మెట్రో పాలిటనో అని పిలువాలని అట్లెటికో మాడ్రిడ్ క్లబ్ యాజమాన్యం ప్రకటించింది. ఈ స్టేడియంను చైనా రియాల్టీ సంస్థ డాలియన్ వాండా గ్రూప్ కమిటీ నిర్మించింది. ఈ సందర్భంగా జట్టు యాజమాన్యం సరికొత్త బ్యాడ్జితో మీడియా ముందుకు వచ్చింది. అట్లెటికో మాడ్రిడ్ జట్టు ఇక నుంచి విసెంటో కాల్డెరోన్ స్టేడియంకు బదులు వాండా మెట్రో పాలిటానో స్టేడియంలో మాత్రమే మ్యాచ్ లు ఆడుతుందన్నాడు.