బెంగళూరు: భారతీయ ఫుట్ బాల్ చరిత్రలో తొలిసారి దేశీయ క్లబ్ జట్టు.. ఖండాంతర టోర్నీ ఫెనల్స్కు వెళ్లడంలో అభిమానుల మద్దతు ఎనలేనిదని, మనోహరంగా ఉందని బెంగళూరు ఎఫ్ సి క్లబ్ హీరో సునిల్ ఛెత్రి వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆసియా ఫుట్బాల్ కాన్ఫిడరేషన్ (ఎఎఫ్సి) టోర్నీ సెమీ ఫైనల్స్లో జొహొర్ దారుల్ తాజిం జట్టుపై విజయం సాధించి బెంగళూరు ఎఫ్ సి క్లబ్ ఫైనల్స్కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే.
కానీ తన వల్లే క్లబ్ ఫైనల్స్కు చేరుకున్నదన్న ఫుట్ బాల్ ఇండియా ఐడియల్ మ్యాన్ భాయిచుంగ్ భూటియా వ్యాఖ్యతో విభేదించాడు. భారత్ ఫుట్ బాల్ ఆటలోనే బెస్ట్ స్ట్రయికర్గా ఎదిగిన సునిల్ ఛెత్రి 'వన్ ఇండియా'కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
'భారతీయ ఫుట్ బాల్ ఆణిముత్యాల్లో భాయిచుంగ్ ఒకరు. ఆయన నాకు ప్రేరణనిచ్చారు. ఆయన అభిమానంతో కొన్ని కామెంట్లు చేశారు. కానీ ఇది అందరికీ వర్తించదు. పికె బెనర్జీ, చున్నీ గోస్వామి, నుంచి భాయిచుంగ్ భూటియా వరకు భారతీయ ఫుట్ బాల్లో ఆణిమత్యాల వంటి ప్లేయర్లు ఎంతోమంది ఉన్నారు. వారందరితో నన్ను పోల్చడం సరికాదు. సుదీర్ఘ కాలం తర్వాత వారు ప్రారంభించిన ఫుట్ బాల్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించానని మాత్రమే చెప్పగలను' అని వినమ్ర వ్యాఖ్యచేశాడు.

అయినా తాము ఫైనల్స్కు చేరుకోవడంలో మనోహరమైన అభిమానుల మద్దతు తోడ్పాటునిచ్చిందని, అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నాడు. జొహొర్ దారుల్ తాజిం జట్టుతో సెమీ ఫైనల్ మ్యాచ్ లో పాల్గొనేందుకు బయలుదేరిన బస్సులో తాను కూర్చున్న సీట్ లో ఓ లేఖ ఉందని, అది బెంగళూరు అభిమానులు రాసిందేనన్నాడు.
ప్రముఖుడు పెలె తెలిపినట్లు 'ఒకవేళ నీవు కఠినమైన అడ్డంకులు ఎదుర్కోకపోతే నీవు, నీ పద్ధతి ఎప్పుడూ పురోభివ్రుద్ధి చెందదు' అని ఆ లేఖలో రాశారన్నాడు. ఈ లేఖను చూసింతర్వాత తామంతా ప్రత్యర్థి జట్టుపై ఉన్నతస్థాయిలో అటాకింగ్ చేయగల సామర్థ్యం పొందామని చెప్పాడు. బెంగళూరు ఎఫ్ సి క్లబ్ సారధి కూడా అయిన సునిల్ ఛెత్రి.. దేశంలో రెండు సంప్రదాయ ఫుట్ బాల్ క్లబ్ లు ఉన్నాయని.. అవి ఈస్ట్ బెంగాల్, మోహన్ భగాన్ అని తెలిపాడు.
వాటి దీవెనలు ఎల్లవేళలా తమ జట్టుకు ఉన్నాయని తెలిపాడు. సెమీ ఫైనల్స్ మ్యాచ్ జరిగిన స్టేడియంలో ఒక ఈస్ట్ బెంగాల్, మరొక మోహున్ భగాన్ పతాకాలు కనిపించాయని గుర్తుచేసుకున్నాడు. దీంతో యావత్ భారతదేశమంతా తమ విజయం కోసం దేవుడ్ని ప్రార్థించిందని భావిస్తున్నానన్నాడు. వచ్చేనెల ఐదో తేదీన దోహలో ఇరాక్ ఎయిర్ ఫోర్స్ క్లబ్ జట్టుతో బెంగళూరు ఎఫ్ సి క్లబ్ తలపడుతుంది. అయితే ఇరాక్ ఎయిర్ ఫోర్స్ జట్టు నుంచి వచ్చే తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవడానికి ప్రణాళిక, వ్యూహం రూపొందిస్తున్నానని స్పానిష్ కోచ్ అల్బెర్టో రోచా చెప్పాడు.
ఫిఖ్యూ లోటు భర్తీపై బార్సిలోనా నజర్!
చాంపియన్స్ షిప్ టోర్నీలో బార్సిలోనా ఎఫ్ సి క్లబ్ శనివారం జరుగనున్న వాలెంసియాపై విజయం సాధించే విషయమై ద్రుష్టి సారించింది. అయితే సెంట్రల్ డిఫెండర్ గేరార్డ్ పిఖ్యూ లేకపోవడం బార్సిలోనాకు పెద్ద లోటే. గత బుధవారం మాంఛెస్టర్ సిటీపై జరిగిన మ్యాచ్లో డేవిడ్ సిల్వాను అడ్డుకుని ఫౌల్ చేసినందుకు ఫిఖ్యూపై నిర్వాహకులు మూడు వారాల పాటు నిషేధం విధించారు. ఈ మ్యాచ్ లో బార్సిలోనా 4 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది. దీంతో బార్సిలోనా ఎఫ్ సి ఫ్రాంచైసీ.. దీనికి ప్రత్యామ్నాయంపై కేంద్రీకరించింది. ఇప్పటికే మరో ప్లేయర్ జోర్డీ అల్బా మోకాలి నరానికి నొప్పితో మ్యాచ్ దూరం కానున్నాడు. అల్బా ప్లేస్లో లుకాస్ డిగ్నే బరిలోకి దిగనున్నాడు. అయితే ఒకింత శుభవార్తేమిటంటే సెర్గీ రోబర్టో, జావియర్ మాచెరానోలు తిరిగి జట్టులోకి రానుండటం బార్సిలోనాకు ఉపశమనమిచ్చే అంశమే.