Sunil Chhetri: భారత్లో ఫుట్బాల్ పేరు వినిపించగానే ఠక్కుల గుర్తుకొచ్చే పేరు.. సునీల్ ఛెత్రి. ఇండియన్ ఫుట్బాల్కు కేరాఫ్ అడ్రస్ ఈ పేరు. క్రికెట్ను ఓ మతంలా ఆరాధించే భారత్ గడ్డపై ఫుట్బాల్కు మంచి గుర్తింపును తీసుకుని రావడంలో కీలక పాత్ర పోషించిన ఏకైక ప్లేయర్ అతనే.
తాజాగా సునీల్ ఛెత్రి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫుట్బాల్కు వీడ్కోలు పలికాడు. జూన్ 6వ తేదీన కువైట్తో జరగబోయే ఫీఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం రిటైర్ అవుతానని వెల్లడించాడు. ఈ మేరకు తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశాడు.

19 సంవత్సరాలుగా ఫుట్బాల్ను ప్రాణంగా ప్రేమిస్తూ వచ్చానని, ఇప్పుడు వీడ్కోలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. తీవ్రమైన ఒత్తిడి, అంతకుమించిన ఆనందం ఫుట్బాల్ మ్యాచ్లల్లో ఆస్వాదించగలిగానని పేర్కొన్నాడు. ఎప్పుడూ వ్యక్తిగతంగా ఆలోచించలేదని, దేశం కోసం ఆడిన అనేక మ్యాచ్లు.. తనకు చిరస్మరణీయంగా మిగిలిపోతాయని చెప్పాడు.
రిటైర్ కావాలనే విషయంపై రెండు నెలలుగా తర్జనభర్జన పడుతూ వచ్చానని, మ్యాచ్ ఆడిన ప్రతీసారీ ఇదే- తన చివరి గేమ్ అవుతుందని భావిస్తూ వచ్చానని వివరించాడు. ఫుట్ బాల్ నుంచి రిటైర్ కావాలనే విషయంపై అంత తేలిగ్గా నిర్ణయాన్ని తీసుకోలేదని, మానసిక సంఘర్షణను అనుభవించినట్లు చెప్పాడు.
రిటర్మెంట్పై తల్లిదండ్రులు, భార్య, కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాతే నిర్ణయం తీసుకున్నానని సునీల్ ఛెత్రి చెప్పాడు. తన నిర్ణయం విన్న తరువాత నాన్న సంతోషించాడని పేర్కొన్నాడు. అమ్మ, భార్య మాత్రం కలత చెందారని అన్నాడు. ఇకపై దేశం తరఫున ఆడబోవట్లేదనే విషయం వారిని ఆవేదనకు గురి చేసిందని అన్నాడు.
జాతీయ జట్టు తరఫున ఇప్పటివరకు 145 మ్యాచ్లను ఆడిన సునీల్ ఛెత్రీ.. 93 గోల్స్ చేశాడు. 2011, 2015, 2021లో జరిగిన శాఫ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్, 2007, 2009, 2012 నెహ్రూ కప్లల్లో అతను మెరుపులు మెరిపించాడు. 2008లో ఏఎఫ్సీ ఛాలెంజ్ కప్ను గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.