గౌహతి: ప్రస్తుత ఐఎస్ఎల్ సీజన్లో జోరు మీదున్న నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టు స్పీడ్కు డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ బ్రేకులేసింది. సెమీస్ దిశగా పరుగులు తీస్తూ ముందుకెళుతున్న జాన్ అబ్రహం జట్టును నిలువరించింది. గురువారం సాయంత్రం గౌహతిలో జరిగిన మ్యాచ్లో నార్త్ఈస్ట్ జట్టుపై 1 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.
సెకండాఫ్ లో 49వ నిమిషంలో ఇటాలియన్ స్ట్రయికర్ చెన్నైయిన్ ప్లేయర్ డావిదే సుక్కీ తెలివిగా చేసిన గోల్ మ్యాచ్ ఫలితాన్ని మార్చివేసింది. చెమటోడ్చిన చెన్నైయిన్ ఖాతాలో రెండో విజయాన్ని నమోదుచేసింది. సుమారు 33 వేల మంది అభిమానుల మధ్య జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన చెన్నైయిన్.. నార్త్ఈస్ట్తో గల పాయింట్ల తేడాను తగ్గించుకోగలిగింది.
ఈ మ్యాచ్లో ఓటమి పాలైనా యధావిధిగా నార్త్ఈస్ట్ పాయింట్ల పట్టికలో టాప్లో కొనసాగుతుండగా, చెన్నైయిన్ ఏడు పాయింట్లతో మూడోస్థానానికి దూసుకొచ్చింది. ఇంతకుముందు జరిగిన నాలుగు మ్యాచ్ల్లోనూ చెన్నైయిన్ జట్టు మూడింటిల్లో నార్త్ ఈస్ట్ చేతిలో ఓటమి పాలవ్వడం గమనార్హం.

చెన్నయిన్ తప్ప ఏ జట్టు కూడా గౌహతిలోని ఇందిరాగాంధీ అథ్లెటిక్ స్టేడియంలో గత రెండు ఐఎస్ఎల్ ఎడిషన్లలో ఒక్క గోల్ గానీ, ఒక్క పాయింట్లు గానీ పొందలేకపోవడం ఆసక్తికర పరిణామమే. డిఫెండింగ్ చాంపియన్ టీంగా చెన్నైయిన్ ప్లేయర్లంతా తమకు ఇంద్రజాలం వంటిదేదో ఆదుకుంటుందని విశ్వసించారు. కానీ డావిదే సుక్కీకి ఈ అవకాశం చిక్కింది.
సుక్కీ గోల్ చేయడంతో అప్పటి వరకు దోబూచులాడిన విజయం చెన్నై సరసన చేరిపోయింది. అయితే ముంబై సిటీ ఎఫ్ సి, ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డీ కోల్ కతా జట్లతో తేడా చాలా స్వల్పం. తదుపరి మ్యాచ్ ల్లో విజయావకాశాలే చెన్నైయిన్ ఫ్లేఆఫ్ దశకు చేరుకుంటుందా? లేదా? అన్న అంశాన్నినిర్ధారిస్తాయి.
నార్త్ఈస్ట్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్ తొలి ఆఫ్ లో చెన్నైయిన్ పై చేయి సాధించడంతోపాటు బెటర్ చాన్స్ లు స్రుష్టించినా సద్వినియోగంచేసుకోలేకపోయింది. సియాం హంగాల్ ఎటువైపు నుంచైనా బాక్స్ లోకి బంతిని పంపేలా ఉన్నాడనిపించినా.. సుక్కీ వద్దకు రాగానే కథ అడ్డం తిరిగింది.
సుక్కీ నేరుగా పంపిన బంతి.. గోల్ కీపర్ సుబ్రతా పాల్ ను దాటుకుని నేరుగా గోల్ పోస్ట్ కు చేరిపోయింది. చెన్నై జట్టు సారధి జాన్ ఆర్నె రైస్ స్థానే జట్టుకు సారధ్యం వహించిన బెర్నార్డ్ మెండీ.. ఎమిలియానో అల్ఫారోను డేంజర్ జోన్ లోకి రాకుండా సరైన సమయంలో అడ్డుకున్నాడు.
గమ్మత్తేమిటంటే ఈ ఎడిషన్ ప్రారంభమైనప్పటి నుంచి సొంత గడ్డపై జరిగిన రెండు మ్యాచ్ ల్లో నార్తఈస్ట్ ఒకటి ఓడిపోవడం ఇదే తొలిసారి. లీగ్ లోనే ఉత్తమ జట్టుగా పేరొందిన నార్త్ఈస్ట్ కోచ్ నెలో వింగాడ.. మ్యాచ్ తరువాత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. వారికి పలు అవకాశాలు వచ్చినా నార్త్ఈస్ట్ కుర్రాళ్లు సద్వినియోగం చేసుకోలేదు. స్ట్రయికర్ ఎమిలియానో అల్ఫారో ముందు వరుసగలో ఉన్పా చొరవచూపలేకపోయాడు.
కాగా ఈ మ్యాచ్ లో నిషేధం ఎదుర్కొంటున్న రీగాన్ సింగ్ స్థానే నిర్మల్ ఛెత్రిని నార్త్ఈస్ట్ జట్టు తీసుకోగా, చెన్నై కోచ్ మార్కో మాట్టరాజీ మూడు మార్పులుచేశాడు. మానైలే బ్లాస్సీ, జాన్ ఆర్నె రైస్, జయేష్ రాణే స్థానే మౌరిజియో పెలుసో, బెర్నార్డ్ మెండి, సియాం హంగాల్ లను జట్టులోకి తీసుకొచ్చాడు.
పెలుసో పంపిన బంతిని నార్త్ ఈస్ట్ గోల్ కీపర్ తొలి హాఫ్ లో అడ్డుకుని విజయవంతంగా అడ్డుకుని జట్టును కాపాడుకోగలిగాడు. తొలి హాఫ్ ముగిసే సమయానికి సుక్కీ, నార్త్ఈస్ట్ సారధి డిడియార్ జొకోరియా మధ్య ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చెన్నైయిన్ తొలి 45 నిమిషాల్లో ఖాతా తెరిచేందుకు పలు అవకాశాలు వచ్చాయి.
హన్స్ ముల్డర్ అతి దగ్గర నుంచి పంపిన హెడర్ ను, మౌరిజియో పెలుసో కొట్టిన కిక్ ను గోల్ కీపర్ సుబ్రతాపాల్ విజయవంతంగా అడ్డుకోగలిగాడు. సెకండాఫ్ లో నాలుగు నిమిషాల తర్వాత సుక్కీ నుంచి వచ్చిన అద్భుతమైన బంతి నేరుగా గోల్ పోస్ట్ కు చేరుకోవడంతో చెన్నైయిన్ జట్టు ఆధిక్యం సాధించినట్లయింది. అప్పటి నుంచి నార్త్ఈస్ట్ కుర్రాళ్లు పదేపదే స్కోర్ సమం కోసం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.