జురిచ్ : ఫుట్ బాల్ ప్రపంచ కప్ విజేత స్పెయిన్ ఫిఫా తాజా ర్యాంకింగ్స్ లోనూ అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. స్పెయిన్ కొన్ని నెలల క్రితమే బ్రెజిల్ కు నెంబర్ వన్ ర్యాంకును కోల్పోయింది. ప్రపంచకప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడిన నెదర్లాండ్స్ నాలుగు నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. బుధవారం ప్రకటించిన ర్యాంకింగ్స్ లో బ్రెజిల్ ఒకటి నుంచి మూడో ర్యాంకుకు పడిపోయింది. సెమీఫైనలిస్ట్ ఉరుగ్వే పది స్థానాలు మెరుగుపర్చుకుని ఆరో స్థానాన్ని సాధించింది. ప్రపంచకప్ లో ఆడనప్పటికీ ఈజిప్ట్ జట్టు ర్యాంకును 14 నుంచి 9కి మెరుగుపర్చుకుంది. చిలీ 18 నుంచి 10వ స్థానానికి ఎగబాకింది. జర్మనీ (4వ), అర్జెంటీనా (5వ), ఇంగ్లాండ్ (7వ), పోర్చుగల్ (8వ) తొలి-10లో ఉన్న ఇతర జట్లు. నిరుటి విజేత ఇటలీ తొలి-10లో స్థానం కోల్పోయింది. 6 నుంచి 11వ ర్యాంకుకు పడిపోయింది. ఫ్రాన్స్ జట్టయితే తొలి-20లో కూడా లేదు. 12 స్థానాలు కోల్పోయి 21వ స్థానానికి చేరింది. ఫిఫా ర్యాంకుల్లో భారత్ స్థానం మెరుగు: ఫిఫా తాజా ర్యాంకింగ్స్ లో భారత్ ఓ స్థానాన్ని మెరుగుపరచుకుంది. ప్రపంచకప్ తర్వాత ఫిఫా ప్రకటించిన ర్యాంకుల్లో భారత్ 160 పాయింట్లతో 132వ ర్యాంకును దక్కించుకుంది. ఆసియా స్థాయిలోనూ భారత్ ఓ ర్యాంకును మెరుగుపరచుకుంది. 46 ఆసియా దేశాల్లో భారత్ దిపుడు 21వ స్థానం. ఫిఫా ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా 20, జపాన్ 32, దక్షిణకొరియా 44వ ర్యాంకును దక్కించుకున్నాయి.