హైదరాబాద్: మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు తయారైంది దక్షిణకొరియా పరిస్థితి. ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీలో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన దక్షిణ కొరియా ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు తొలుత అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఆ సందర్భంగా ఫొటోసెషన్ కోసం సిద్దమైన ఆటగాళ్లపై అభిమానులు గుడ్లు, మెత్తలతో దాడి చేశారు.
కనీసం నాకౌట్కు కూడా చేరని ఆటగాళ్లకు ఫొటోసెషన్ ఎందుకని మీడియా సిబ్బందిని సైతం అడ్డుకున్నారు. అయితే డిఫెండింగ్ ఛాంపియన్, ఫుట్బాల్ మాజీ ఛాంపియన్ అయిన జర్మనీని ఓడించి దక్షిణ కొరియా పెను సంచలనం నమోదు చేసిన విషయం తెలిసిందే. పోరాడితే పోయేదేమీ లేని స్థితిలో... కొరియా పోతూపోతూ డిఫెండింగ్ చాంపియన్నూ తనతో పట్టుకుపోయింది.
కనీసం ఈ గెలుపుతోనైనా అభిమానులు సంతోషిస్తారని భావించిన కొరియా ఆటగాళ్ల నిరాశే ఎదురైంది. గ్రూప్ దశలో నిష్క్రమించి జూన్లోనే స్వదేశం చేరుతామనుకోలేదని జట్టు మేనేజర్ షిన్ ఆవేదన చెందారు. నాకౌట్కు చేరి జూలై ఆసాంతం ఆడుతామని భావించామని, కానీ అలా జరగలేదన్నారు. అభిమానుల మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ...క్షమాపణలు కూడా తెలియజేశారు.
అభిమానులకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయామని, కానీ జర్మనీపై గెలవడంతో వారు కొంత సంతోషపడతారని భావించామని పేర్కొన్నారు. అయితే అభిమానులు విసిరిన గుడ్లు షిన్కు సమీపంలో పడటం విశేషం. కొన్ని గుడ్లు ఆటగాళ్ల సమీపం వరకూ వచ్చాయి. ఈ ఘటన అంతా ఆటగాళ్లు తిరిగి వచ్చిన విమానాశ్రయం బయటే జరిగింది.