జోహాన్నెస్ బెర్గ్: ప్రపంచకప్లో దక్షిణ కొరియా బోణీ చేసింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 17వ స్థానంలో ఉన్న గ్రీస్తో శనివారం జరిగిన గ్రూప్ 'బి' లీగ్ మ్యాచ్లో దక్షిణ కొరియా 2-0తో గెలిచింది. ఈ ప్రపంచకప్లో విజయాన్ని నమోదు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. 2002లో జపాన్తో కలిసి ప్రపంచకప్కు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన కొరియాకు విదేశీగడ్డపై కేవలం ఇది రెండో గెలుపు కావడం గమనార్హం. పటిష్టమైన డిఫెన్స్ ఉన్న జట్టుగా పేరొందిన గ్రీస్పై కొరియా మంచి హోమ్వర్క్ చేసింది. ఆది నుంచే ఎదురుదాడులకు దిగింది. వారి ప్రయత్నం ఏడో నిమిషంలోనే ఫలించింది.
ఎడమవైపు నుంచి కీ సుంగ్ యుయెంగ్ సంధించిన ఫ్రీకిక్ను పెనాల్టీ ఏరియాలో గోల్ పోస్ట్ ముందున్న లీ జంగ్ సూ లక్ష్యానికి చేర్చాడు. దాంతో కొరియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరంభంలోనే గోల్ సమర్పించుకోవడంతో గ్రీస్ శిబిరంపై ఒత్తిడి పెరిగింది. మరోవైపు కొరియా రెట్టించిన ఉత్సాహంతో తమ దాడుల్లో మరింత పదును పెంచింది. గ్రీస్కు పుంజుకునే అవకాశం ఇవ్వకుండా ఎడతెరిపిలేకుండా దాడులు చేసింది. పక్కా రక్షణాత్మక ఆటతీరుతో 2004లో యూరో చాంపియన్గా నిలిచిన గ్రీస్ వ్యూహం ఈ మ్యాచ్లో కొరియా ముందు పనిచేయలేదు. విరామ సమయానికి కొరియా ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది.
రెండో అర్ధభాగంలోనూ కొరియా జోరు కొనసాగింది. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్కు ఆడే పార్క్ జీ సంగ్ 52వ నిమిషంలో కొరియాకు రెండో గోల్ను అందించాడు. గోల్ పోస్ట్ నుంచి 30 గజాల దూరంలో బంతిని అందుకున్న పార్క్ ముగ్గురు గ్రీస్ డిఫెండర్లను చాకచక్యంగా తప్పించుకుంటూ మిగతా పనిని పూర్తి చేశాడు. దాంతో కొరియా ఆధిక్యం 2-0కి పెరిగింది. ఆ తర్వాత గ్రీస్ కనీసం ఒక్క గోల్ చేయడానికి విశ్వప్రయత్నం చేసి విఫలమైంది.
ఈ మ్యాచ్లో రెండో గోల్తో వరుసగా మూడు ప్రపంచకప్లలో (2002, 2006, 2010) గోల్స్ చేసిన రెండో ఆసియా క్రీడాకారుడిగా పార్క్ గుర్తింపు పొందాడు. రెండోసారి ప్రపంచకప్ లో ఆడుతున్న గ్రీస్ ఖాతాలో ఇప్పటికి ఒక్క గోల్ కూడా చేరలేదు.