
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ నాలుగో సీజన్కు శుక్రవారం తెరలేచింది. ఐఎస్ఎల్ 4వ సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నాలుగు నెలల పాటు ఈ టోర్నీ పుట్బాల్ అభిమానులకు వినోదాన్ని పంచనుంది. కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ కత్రినాకైఫ్.. 'ధూమ్', 'తీస్మార్ఖాన్'లోని పాటలకు డ్యాన్స్ చేశారు. స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. నవంబరు 17న ప్రారంభమయ్యే ఈ టోర్నీ 2018 మార్చి 18న ముగియనుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికొ డీ కోల్కతాతో గతేడాది రన్నరప్ కేరళ బ్లాస్టర్స్తో తలపడనుంది.
కేరళ బ్లాస్టర్ జట్టుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సహ యజమానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ లీగ్లో మొత్తం 108 రోజుల పాటు మ్యాచ్లు జరగనున్నాయి. 2014లో ప్రారంభమైన ఇండియన్ సూపర్ లీగ్ తొలి సీజన్లో 70 రోజులు.. ఆ తర్వాతి రెండు సీజన్లలో 80 రోజుల చొప్పున జరిగింది. అయితే నాలుగో సీజన్లో మాత్రం ఈ టోర్నీని 108 రోజులకు పెంచారు.
జంషెడ్పూర్ ఎఫ్సీ, బెంగళూరు ఎఫ్సీ ఈసారి లీగ్లో ప్రవేశించిన రెండు కొత్త జట్లు. ఇంకా చెన్నయిన్ ఎఫ్సీ, గోవా ఎఫ్సీ, పుణె సిటీ ఎఫ్సీ, ముంబై సిటీ ఎఫ్సీ, ఢిల్లీ డైనమోస్ ఎఫ్సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ సహా మొత్తం 10 జట్లు లీగ్ బరిలో దిగనున్నాయి. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
ఫైనల్ మార్చి17న కోల్కతాలో జరగనుంది. ఇదిలా ఉంటే ప్రారంభ వేడుకల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్తో పాటు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీతో పాటు మళయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి తదితరులు పాల్గొన్నారు.