హైదరాబాద్: ఫిఫా ప్రపంచ కప్లో భాగంగా రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టు క్రొయేషియాతో పోరాడనుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు గెలవాలని భారత క్రికెట్ దిగ్గజం..సచిన్ టెండూల్కర్ కోరుకుంటున్నాడు. అంతేకాదు దాంతో పాటు ప్రపంచకప్లో బ్రిటీష్ జట్టుకే మద్దతు ప్రకటించి క్రీడాభిమానులను ఆశ్చర్యపరిచాడు.
అభిమానులు 'ఇండియన్ క్రికెట్ గాడ్'గా పిలుచుకునే సచిన్..కేవలం క్రికెట్ ఆటనే కాదు మిగతా క్రీడలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. ఫుట్బాల్ ఆటకు వీరాభిమాని అయిన మాస్టర్.. 2018 ప్రపంచకప్లో జోరు మీదున్న ఇంగ్లండ్ జట్టును ప్రోత్సహిస్తున్నాడు.క్రొయేషియాతో సెమీఫైనల్ మ్యాచ్ ఆడనున్న ఇంగ్లండ్ నెగ్గాలని..మాస్టర్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
Come on England!! #FIFA18@JamosFoundation pic.twitter.com/S9PZ9EWQHk
— Sachin Tendulkar (@sachin_rt) July 11, 2018
ఇంగ్లండ్ను మద్దతు తెలుపుతూ ఓ వీడియో చిత్రీకరించి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్టులో ఇంగ్లాండ్ జట్టు మాజీ ఫుట్బాలర్ డేవిడ్ జేమ్స్ను ట్యాగ్ చేశాడు. ఈ డేవిడ్ జేమ్స్ కేరళ ఫుట్బాల్ జట్టుకు మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. ఈ కేరళ జట్టుకు సచిన్ టెండూల్కర్ సహ యజమాని అనే సంగతి తెలిసిందే.
సచిన్ సపోర్ట్ చేస్తుండటంతో క్రికెట్ అభిమానులు సైతం ఇంగ్లండ్ జట్టు నెగ్గాలని కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్ ఫుట్బాల్ కెరీర్లో 1966లో మాత్రమే ప్రపంచ కప్ను గెలుచుకోగలిగింది. ఇండియన్ సాకర్ లీగ్లో కేరళా బ్లాస్టర్స్ జట్టు కో ఓనర్గా ఉన్న సచిన్..భారత్లో ఫుట్బాల్ ఆటకు ఆదరణ పెంచేందుకు తోడ్పడుతున్నాడు.