
హైదరాబాద్: క్రిస్టియన్ రొనాల్డో ఫుట్బాల్ క్రీడలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చినందుకు సంబరపడిపోతున్నాడు. ఈ మధ్యనే తనను వరిస్తున్న భారీ బహుమతులను, నజరానాలను చూసుకుని మురిసిపోతున్నాడు. అంతేకాదు. "నేను మెస్సీతో పోటీ పడుతుండటం నాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే తనెంత గొప్ప ఆటగాడో నాకు తెలుసు" అని వెలిబుచ్చాడు.
రియల్ మద్రిద్ క్లబ్ సమావేశంలో పాల్గొన్న రొనాల్డో పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టాడు. తన జట్టు కోసం తాను చేసే పనులు వెలకట్టలేనివంటూ అభిప్రాయపడ్డాడు.
తాను ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు కోసం తాపత్రయ పడుతుంటానని పేర్కొన్నాడు. అది చాలా వరకు పూర్తి చేశానని తనకంటూ ఒక అధ్యాయం లిఖించానని తెలిపాడు. ఫుట్ బాల్ చరిత్రలోనే తన పేరు గుర్తిండిపోతుందని పేర్కొన్నాడు. ఒక ఆటగాడిగా మెస్సీలా తానూ వ్యక్తిగత అవార్డులు పొందడం ఆనందంగా ఉందన్నాడు.
రొనాల్డో ఇప్పటికీ మూడు ప్రీమియర్ లీగ్లను గెలుచుకున్నాడు. లాలిగా టైటిళ్లను రెండు సార్లు, ఛాంపియన్ లీగ్లను నాలుగు సార్లు దక్కించుకున్నాడు.
ఈ 32 ఏళ్ల ఆటగాడు యూరోపియన్ ఛాంపియన్ షిప్ను జట్టుతో కలిసి 2016లో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా మాట్లాడినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన ఛాంపియన్ షిప్ గెలుచుకోవడం ఆనందంగా ఉంది. పోర్చుగల్ జాతీయ జట్టుతో కలసి ఇది సంపాదించడం నాకు బాగా నచ్చింది. అని పేర్కొన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.