|
కేరళలో ఫుట్బాల్ క్రేజ్..
భారతదేశంలో ఫుట్బాల్ క్రేజ్ విపరీతంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి. ఇక్కడ అర్జెంటీనా, పోర్చుగల్, బ్రెజిల్ జట్ల అభిమానులు మరీ ఎక్కువ. కొందరైతే ఆయా దేశాలకు చెందిన మెస్సీ, రొనాల్డో, నెయ్మార్లను విపరీతంగా ఆరాధిస్తారు. అందుకే ఫిఫా వరల్డ్ కప్ ఆరంభానికి ముందే ఈ ముగ్గురి కటౌట్లు తయారు చేసి స్థానికంగా ఉన్న నది మధ్యలో నిలబెట్టారు కూడా. దీనికి సంబంధించిన ఫొటోలు పోర్చుగల్, బ్రెజిల్, అర్జెంటీనాలో కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు కేరళలోనే వెలుగు చూసిన మరో విషయం ఇక్కడి ఫుట్బాల్ క్రేజ్కు అద్దం పడుతోంది.
ఫ్రీ బిర్యానీ ఆఫర్..
కేరళలో ఫుట్బాల్ క్రేజ్ను థ్రిస్సూర్లోని ఒక హోటల్ యజమాని మరోసారి నిరూపించాడు. స్థానికంగా నివశించే శిబు అనే వ్యక్తి ఒక హోటల్ నిర్వహిస్తున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అర్జెంటీనా ఈ వరల్డ్ కప్లో ఫైనల్ చేరడంతో అతను చాలా సంతోషించాడు. ఈసారి అర్జెంటీనా గనుక కప్పు కొడితే వెయ్యి మందికి ఉచితంగా బిర్యానీ పంచిపెడతానని మాటిచ్చాడు. దీనికోసం ప్రత్యేకంగా ఒక బ్యానర్ కట్టించాడు. ఫైనల్లో ఫ్రాన్స్ను అర్జెంటీనా ఓడించడంతో ఎంతో సంతోషించిన అతను బిర్యానీ పంచిపెట్టెందుకు రెడీ అయ్యాడు. దీంతో ఆ హోట్ ముందు కిలోమీటర్ల మేర స్థానికులు బారులు తీరారు. ఇంత మంది రావడంతో మరో 500 బిర్యానీలను అదనంగా పంచిపెట్టినట్లు శిబు చెప్పాడు.
|
36 ఏళ్ల నిరీక్షణ..
ఈ హోటల్ దగ్గరకు వచ్చిన స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నాడు. తాము 36 ఏళ్లుగా అర్జెంటీనా విజయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పాడు. ఇది మెస్సీ వయసు కన్నా ఎక్కువ అని, అంటే అతను పుట్టకముందు నుంచి తాము ఎదురు చూస్తున్న క్షణం ఇప్పుడొచ్చిందని చెప్పాడు. అర్జెంటీనా ఓడినప్పుడు ఫ్యాన్స్గా ఉన్న తాము.. గెలిచినప్పుడు సైలెంట్గా ఎలా ఉంటామన్నాడు. ఇదే విషయాన్ని శిబు కూడా చెప్పాడు. మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడటంతో తాను చాలా సంతోషించానన్నాడు. అందుకే అదనంగా మరో ఐదు వందల బిర్యానీలను పంచిపెట్టానని చెప్పాడు. శిబు పంచిపెట్టిన బిర్యానీ చాలా బాగుందని దాన్ని తిన్న వాళ్లందరూ అంటున్నారు.