హైదరాబాద్: రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్(ఆర్ఎఫ్వైఎస్) జాతీయ ఫుట్బాల్ టోర్నీ రెండో సీజన్ బుధవారం ప్రారంభమైంది. కోచిలోని రాజగిరి పబ్లిక్ స్కూల్లో నీతా అంబానీ ఈ సీజన్ను ప్రారంభించారు. దేశంలోని 30 ప్రధాన నగరాల్లో జరిగే ఈ టోర్నీకి ఆమె శ్రీకారం చుట్టారు.
'రిలయన్స్ ఫౌండేషన్ యూత్ స్పోర్ట్స్ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా స్ఫూర్తిని పెంచుతుంది. ఆర్ఎఫ్వైఎస్ ద్వారా ఏకీకృత క్రీడా వ్యవస్థను రూపొందించడమే మా లక్ష్యం. దేశంలోని యువతకు క్రీడల ద్వారా తగిన అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం' అని నీతా అంబానీ అన్నారు.

వచ్చే ఐదు నెలల్లో 3000 విద్యా సంస్థల నుంచి 60 వేలకు పైగా చిన్నారులు ఈ టోర్నీలో పాల్గొననున్నారు. తొలి ఏడాది 8 ఐఎస్ఎల్ జట్ల వేదికల్లో ప్రారంభమైన ఈ టోర్నీ ఈ సారి బెంగళూరు, అహ్మదాబాద్, షిల్లాంగ్ , ఐజ్వాల్, ఇంఫాల్, హైదరాబాద్, జంషెడ్పూర్లలో కూడా జరుగనుంది.
కోచిలోని నిర్మల కాలేజికి చెందిన 20 ఏళ్ల అజిత్ శివన్ వచ్చే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో కేరళ బ్లాస్టర్స్ తరుపున ఆడనున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'గతేడాది ఆర్ఎఫ్వైఎస్లో అజిత్ సత్తా చాటాడు. వెంటనే బ్లాస్టర్స్ అతడిని ఎంపికచేసుకుంది. భవిష్యత్తులో మరింత మంది అజిత్ శివన్లను వెలుగులోకి తీసుకొస్తాం. గ్రామీణ స్థాయిలో క్రీడల్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం'' అని అన్నారు.