హైదరాబాద్: పోర్చుగల్ పుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. గౌతమ బుద్ధుడిని అవమానించాడు. గౌతమ బుద్ధుడి విగ్రహం ముందు క్రిస్టియానో రొనాల్డో కాలు పెట్టి నిల్చోని దిగడంతో వివాదాస్పదమైంది.
వివరాల్లోకి వెళితే... గౌతమ బుద్ధుడి విగ్రహం ముందు కాలు పెట్టి ఫొటోకు పోజిచ్చిన క్రిస్టియానో ఆ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. దీంతో ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. బుద్ధుడిని అవమాన పరిచాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అతనిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
గౌతమ బుద్ధుడి విగ్రహంపై కాలుపెట్టి క్రిస్టియానో తన అహంకారాన్ని చాటుకున్నాడని బుద్ధిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

''క్రిస్టియానో నేను నీ అభిమానిని. నువ్వు బుద్ధుడిని గౌరవించడం నేర్చుకోవాలి. నువ్వు క్రిస్టియన్వా, ముస్లింవా, హిందువా? అన్నది తర్వాత. నీకు అన్ని మతాలకు చెందిన అభిమానులు ఉన్నారు. నువ్వు ఇలా చేయడం సరికాదు. నేనైతే నిన్ను క్షమిస్తా, కానీ నీ పని వల్ల మా(బుద్ధిస్టుల) మనసులు గాయపడ్డాయి'' అని ఓ అభిమాని ఇన్స్టాగ్రామ్ పోస్టు చేశాడు.
''నీ చర్యతో ఓ అభిమానిని కోల్పోయావు'' అని ఇంకో అభిమాని పేర్కొన్నాడు. ఫొటో పోస్టు అయిన 9 గంటల్లో 1.9 మిలియన్ల లైకులు రాగా 9,40,381 మంది స్పందించారు. వీరిలో 47,677 మంది రొనాల్డోపై మండిపడ్డారు.