జ్యూరిచ్: అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) అధ్యక్షుడిగా సెప్ బ్లాటర్ వరుసగా ఐదోసారి ఎన్నికయ్యాడు. అవినీతి ఆరోపణలు, తీమ్రైన ఒత్తిళ్ల మధ్య పోటీకి దిగిన బ్లాటర్ తన ప్రత్యర్థి అలీ బిన్ అల్ హుస్సేన్ను 133-73 ఓట్ల తేడాతో ఓడించాడు.
పోటీ తీవ్రంగా ఉంటుందన్న వార్తలు వచ్చినా బ్లాటర్కు ఎదురులేకపోయింది. 1975 నుంచి బ్లాటర్కు ఫిఫాతో అనుబంధం ఉంది. కార్యవర్గ సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా పదవులను నిర్వహించిన అతను 1989లో మొదటిసారి ఫిఫా అధ్యక్ష పదవిని చేపట్టాడు.
అప్పటి నుంచి వరుగా ఐదోసారి ఈ పదవి అతనికి దక్కింది. బ్లాటర్ పలుకుబడి ముందు అల్ హుస్సేన్ నిలవలేకపోయాడు. కాగా, ఫిఫా ప్రారంభమై ఇప్పటికి 111ఏళ్లు పూర్తయ్యాయి.
ఫిఫా కాంగ్రెస్కు బాంబు బెదిరింపు కాల్స్
ఇది ఇలా ఉండగా, ఫిఫా 61వ కాంగ్రెస్ను బాంబు భయం వెంటాడింది. అధ్యక్షుడిని ఎన్నిక చేసేందుకు శుక్రవారం సమావేశమైన ఈ వార్షిక సర్వసభ్య సమావేశం ఆరంభం కాకముందే, పాలస్తీనా మద్దతుదారులు నిరసనకు దిగారు. భద్రతా దళాలు వారిని చెదరగొట్టడంతో ఫిఫా అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
అయితే, సమావేశ మందిరంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేయడంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబ్ స్క్వాడ్తో అణువణువునూ క్షుణ్ణంగా గాలించిన తర్వాత, బాంబు ప్రమాదం లేదని తేల్చారు. ఆ తర్వాతే సమావేశం మొదలైంది.