కోల్ కతా: అట్లెటికో డీ కోల్ కతా సారధి హెల్డర్ పొస్టిగ శనివారం ఢిల్లీ డైనమోస్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశముందని ఆశాభావం వ్యక్తంచేశాడు. పక్కటెముకలకు గాయంతో కోలుకుంటున్న పొస్టిగ గురువారం ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.
'నేను మరింత కోలుకున్నానని భావిస్తున్నా. జట్టుతో కలిసి వారం రోజులుగా ట్రైనింగ్ లో పాల్గొంటున్నా. నేను టీం కోసం 100 శాతం పని చేయాలని భావిస్తున్నా. మాకు మరో రోజు సమయం ఉంది. నేనెప్పుడు ఆడాలన్న విషయాన్ని జట్టు కోచ్ నిర్ణయిస్తాడు' అని పొస్టిగ మీడియాకు తెలిపాడు.
డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ తో జరిగిన తొలి మ్యాచ్ ప్రారంభమైన 72 నిమిషాల తర్వాత గ్రౌండ్ నుంచి బయటకొచ్చిన పొస్టిగ.. సెకండ్ మ్యాచ్ లోనూ గాయం కొనసాగడంతో తర్వాత మైదానంలో అడుగు పెట్టలేదు. తనకు గతేడాది అయిన గాయంతో పోలిస్తే ఈ గాయమేమీ సీరియస్ కాదు. గత ఏడాది తన కెరీర్ లోనే అతి దారుణమైన గాయమైందన్నాడు.

ఫుట్ బాల్ ఆట కెరీర్ లోనే గాయాలు ఇమిడి ఉంటాయని, రెండోసారి భారత్ లో ఆడేందుకు వచ్చానని, కానీ దురద్రుష్టం తనను వెంటాడుతున్నదన్నాడు. ప్రస్తుతం పక్కటెముకల్లో చిన్నపాటి నొప్పి వస్తున్నదని, కానీ ఫుట్ బాల్ లో గాయాలన్నీ సర్వ సాధారణమని, తాను బెటర్ గానే ఉన్నట్లు భావిస్తున్నానన్నాడు.
అట్లెటికో డీ కోల్ కతా, ఢిల్లీ డైనమోస్ మధ్య జరిగిన నాలుగు మ్యాచ్ ల్లోనూ ఓటమి పాలవ్వలేదు. కానీ రెండు జట్ల కూర్పు శనివారం మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేయనున్నది. ఇదే పరిస్థితి కొనసాగింపుపై పొస్టిగ స్పందిస్తూ 'లీగ్ చాలా పొట్టిగా ఉన్నది. ఒకవేళ మీరు రెండుగానీ, మూడుగానీ మ్యాచ్ లు గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంటారు. టెంపో కొనసాగింపు చాలా ముఖ్యం. మేం ప్లే ఆఫ్ కు క్వాలిఫై అవుతామని ఆశాభావం ఉంది' అని అన్నాడు.
ప్రాక్టీస్ గ్రౌండ్ మార్చిన గోవా
ఎఫ్ సి గోవా ఫుట్ బాల్ క్లబ్ మరోసారి తన ప్రాక్టీస్ గ్రౌండ్ ను మార్చివేసింది. ఇప్పటి వరకు నాగోవా గ్రామ పంచాయతీ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేసిన గోవా జట్టు ఇక నుంచి సీసా ఫుట్ బాల్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్ కు మార్చివేసింది. అట్లెటికో డీ కోల్ కతాతో జరిగిన మ్యాచ్ ను 1 - 1 స్కోర్ తేడాతో డ్రా గా ముగించిన తర్వాత గోవా జట్టు సీసా ట్రైనింగ్ సెషన్ మార్చింది. ముంబై సిటీ ఎఫ్ సి జట్టుతో గోవా జట్టు తదుపరి మ్యాచ్ లో తలపడాల్సి ఉంది. ముంబైతో జరిగే మ్యాచ్ గోవా నాకౌట్ దశకు చేరుకునేందుకు కీలకం కానున్నది.
నవీ ముంబైకి ఫిఫా ఓకే
వచ్చే ఏడాది జరుగనున్న ఫిఫా యు - 17 వరల్డ్ కప్ టోర్నీ మ్యాచ్ ల నిర్వహణకు నవీ ముంబైలోని డివై పాటిల్ స్పోర్ట్స్ స్టేడియం వినియోగించుకోవచ్చునని ఫిఫా ప్రతినిధులు నిర్ణయించారు. ఫిఫా, స్థానిక నిర్వాహక కమిటీ (ఎల్ఓసి)తో కలిసి 22 మంది ప్రతినిధుల ఉన్నత స్థాయి బ్రుందం గురువారం నవీ ముంబైలోని డివి పాటిల్ స్టేడియంను సందర్శించింది.
2014 నవంబర్ లో తొలిసారి తాను, జాయ్ భట్టాచార్యతో కలిసి ఇక్కడకు వచ్చినప్పుడు టోర్నీ నిర్వహణపై సందేహాలు ఉండేవని, కానీ డాక్టర్ విజయ్ పాటిల్, డాక్టర్ పాటిల్, డివై పాటిల్ సంస్థల ప్రతినిధులను కలిసి సంప్రదించిన తర్వాత ఈ టోర్నీ గురించి వారు తెలుసుకున్నారన్నారు.
జీవితంలో ఒక్కసారి లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తనతో చె్పారని టోర్నమెంట్ డైరెక్టర్ జావియర్ చెప్పి మీడియాకు తెలిపారు. ప్రస్తుతం వరల్డ్ కప్ నిర్వహణకు 23రోజులకు పైగా సమయం ఉందని, ఈ లోగా పరిస్థితిని అంచనా వేసేందుకు ఇక్కడకు వచ్చామన్నాడు. ఫిఫా వరల్డ్ కప్ నిర్వహణకు అవసరమైన వసతులన్నీ కల్పిస్తామని నాడు పాటిల్ తనకు హామీనిచ్చారన్నారు.
నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంను ఫిఫా అండర్ - 17 వరల్డ్ కప్ నిర్వహణకు ఎంపికచేస్తున్నట్లు ప్రకటిస్తున్నానని అన్నారు. డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు విజయ్ పాటిల్ మాట్లాడుతూ 'ఈ అవకాశం భారత ఫుట్ బాల్ ప్రగతి పథంలో పైపైకి దూసుకెళ్లేందుకు ఇది చరిత్రాత్మక సందర్భం.
మాకు అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య, దాని అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ నుంచి సంపూర్ణ మద్దతు లభించింది' అని చెప్పాడు. కేరళలోని కోచి స్టేడియంకు తొలుత ఫిఫా ప్రతినిధులు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తదుపరి శనివారం గోవాను సందర్శిస్తారు.