
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ సిరీస్ లో భాగంగా ఢిల్లీ-జంషెడ్పూర్ల మధ్య బుధవారం ఢిల్లీలోని జవహార్లాల్ నెహ్రూ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్ మ్యాచ్లో పాల్గొన్న ఆటగాళ్లు వాయు కాలుష్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో శ్రీలంక-ఇండియాల మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లోనూ ఇదే ఇబ్బంది తలెత్తడంతో ఆటగాళ్లకి మాస్క్లు తప్పనిసరిగా మారాయి.
ఇదే పంథాని కొనసాగిస్తూ ఫుట్బాల్ ఆటగాళ్లు ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ మంగళవారం ఉదయం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ కోచ్ ఏంజెల్ పోర్చుగల్ మాట్లాడుతూ.. 'మా ఆటగాళ్లు మాస్క్లు ధరించి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నది నిజమే. బుధవారం జంషెడ్పూర్తో జరగనున్న మ్యాచ్లో మాత్రం మా వాళ్లు మాస్క్లు ధరించి ఆడరు. ఇది దిల్లీ హోం గ్రౌండ్. మ్యాచ్ జరగదు అన్నదానిపై ఎలాంటి సందేహాలు వద్దు. తప్పకుండా జరుగుతుంది' అని పోర్చుగల్ వాఖ్యానించారు.
ఢిల్లీలోని ఫిరోజ్షా కోట్లా మైదానంలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో వాయు కాలుష్యం కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లు ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం ఉదయం లంక ఆటగాడు లక్మల్, సాయంత్రం భారత ఆటగాడు షమి బౌలింగ్ వేసే సమయంలో కాస్త ఇబ్బందికి గురై మైదానంలోనే వాంతులు చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా, ఢిల్లీ ఫుట్బాల్ జట్టు కోచ్ పోర్చుగల్ క్రీడాకారులు మాస్క్లు లేకుండానే ఆడగలరనే నమ్మకాన్నే వెలిబుచ్చడంపై ఫలితం కోసం వేచి చూడాలి.