కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీ ప్రారంభానికి కౌంట్డౌన్ మొదలైంది. మరో 12 రోజుల గడువు మాత్రమే ఉండటంతో నిర్వాహకులు త్వరితగతిన ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. కానీ కోల్కతాలో మ్యాచ్ల నిర్వహణకు పర్యావరణ సంబంధ సమస్యలు, ఆటంకాలు ఎదురు కానున్నాయి. కోల్కతాలో ఫుట్బాల్ మ్యాచ్ల నిర్వహణను సవాల్చేస్తూ పార్యవరణ వేత్త సుభాష్ దత్తా ప్రచారోద్యమం చేపట్టడంతోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించడమే ఈ ఆటంకాలకు హేతువైంది.
అట్లెంటికో డీ కోల్కతా జట్టు వచ్చేనెల రెండో తేదీన రవీంద్ర సారోబార్లో చెన్నయిన్ ఎఫ్సి జట్టు తలపడాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ స్టేడియంలో కనీసం ఏడు మ్యాచ్లు జరగాల్సి ఉంది. కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పర్యావరణ వేత్త సుభాష్ దత్తా పిటిషన్ దాఖలుచేయడంతో ఈ సీజన్లో ఐఎస్ఎల్ మ్యాచ్లకు స్టాల్లేక్ స్టేడియం అందుబాటులో ఉండదు. ఈ స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణతో సమీపంలో ఉన్న పర్యావరణ జోన్కు సమస్యలు ఎదురవుతాయని పిటిషనర్ వాదన. కొలనుతోపాటు నేషనల్ ప్లాన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ అక్వాటిక్ ఎకో సిస్టమ్స్ కింద వృక్ష, జంతు జాలాన్ని సంరక్షించాల్సి ఉంటుందన్నారు.

అప్రధాన స్టేడియమే శరణ్యమా!
దీని ఫలితంగా దక్షిణ కోల్కతాలోని అప్రధాన స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించుకోవాల్సి రావడం అట్లెంటికో డీ కోల్కతా జట్టుకు గట్టి ఎదురు దెబ్యే కానున్నది. రవీంద్ర సారోబార్ స్టేడియంలో 26 వేల మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశముండగా, యువ భారతి కృరాంగన్లో 85వేల మంది వీక్షించేందుకు వీలున్నది. వచ్చే ఏడాది జరిగే అండర్ - 17 వరల్డ్ ఫుట్బాల్ కప్ టోర్నమెంట్ కోసం స్టాల్లేక్ స్టేడియంలో మరమ్మతులు చేస్తున్న దృష్ట్యా.. అట్లెంటికో డీ కోల్కతాకు మరో చాన్స్ లేదు.
రవీంద్ర సారోబార్ స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుతురులో మ్యాచ్ల నిర్వహణను అనుమతించే ప్రసక్తే లేదని సుభాష్ దత్తా స్పష్టంచేస్తున్నారు. ఫ్లడ్లైట్ల వినియోగం వల్ల సమీపంలోని రవీంద్ర సారోబార్ చెరువుకు పర్యావరణ సమస్య ఎదురవుతుందని ఆయన ఆందోళన. 2002లో ఈ చెరువును నేషనల్ లేక్ కన్జర్వేషన్ ప్లాన్ జాబితాలో చేర్చడం కోసం సుభాష్దత్తా చేసిన ఆందోళనే కీలకం.
అందుకే ఆయన కూడా అత్యున్నత స్థాయి ప్రమాణాలతో జరిగే మ్యాచ్ల్లో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. డే టైం మ్యాచ్లను మాత్రమే అనుమతిస్తామని చెబుతున్నారు. అదీ కూడా నిర్వాహకులు షరతులు కఠినంగా అమలుచేస్తేనే సాధ్యమని అన్నారు. హై పవర్డ్ స్పీకర్లను, బాణా సంచా పేలుళ్లను అనుమతించేది లేదని కూడా తేల్చి చెప్పారు.
స్పందించని గ్రీన్ ట్రిబ్యునల్
ఇప్పటి వరకు సుభాష్ దత్తా పిటిషన్ ప్రతి తమకు అందనందున దీనిపై తాను స్పందించబోనని అట్లెంటికో డీ కోల్కతా అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆచితూచి స్పందించింది. రవీంద్ర సారోబార్ చెరువుకు ఎటువంటి పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు.
ఒకవేళ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీచేస్తే ప్రభుత్వం చేపట్టే తదుపరి చర్యలేమిటో చెప్పడానికి నిరాకరించారు. ఇప్పటివరకైతే ఈ అంశంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యంచేసుకోలేదు. కానీ జట్టు యాజమాన్యం కొత్త వేదికపై మ్యాచ్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సరిపడా సమయం లేదు. రవీంద్ర సారోబార్ స్టేడియంను ఆధునీకరించినా ఈ తరహా హై ప్రొఫైల్ మ్యాచ్ల నిర్వహణ కష్ట సాధ్యమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి.