హైదరాబాద్: సాధారణంగా క్రికెట్లో డ్రింక్స్ బ్రేక్ అంటే మంచి నీళ్లే లేదంటే పెప్సీ, కోకా-కోలా లాంటివి తాగడం మనం ఇప్పటివరకు చూశాం. కానీ ఆ స్టేడియంలో ఆడే ఆటగాళ్లు మంచినీళ్లు తాగితే సరిపోదు. కచ్చితంగా ఆక్సిజన్ పీల్చాల్సిందే. ఎందుకంటే ఆ స్టేడియం సముద్ర మట్టానికి 3658 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి.
టిబెట్లోని లాసాలో అత్యాధునికంగా నిర్మించిన స్టేడియంలో ఆడటానికి ఫుట్బాల్ ప్లేయర్స్ భయపడుతున్నారు. ఎందుకంటే అంతఎత్తులో మనుషులు జీవించడం చాలా కష్టం. ఆక్సిజన్ దొరక్క ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో చైనా ప్రొఫెషనల్ లీగ్లో పాల్గొనే జట్లు ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నాయి.

లాసా చెంగ్టౌ టీమ్ ఈసారి లీగ్కు అర్హత సాధించింది. లాసా జట్టుతో పాటు మరో ఐదు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. టోర్నీలో పాల్గొనే జట్లన్నీ ప్రత్యర్థి జట్ల సొంతగడ్డపై ఆడాల్సి ఉంటుంది. అయితే లాసా జట్టు ఉన్న స్టేడియం సముద్ర మట్టానికి 3658 మీటర్ల ఎత్తులో ఉంది కాబట్టి అక్కడ మ్యాచ్లు నిర్వహిస్తారా లేదా అన్నది అనుమానంగా మారింది.
దీంతో ఈ స్టేడియంలో ఆడుతున్న సమయంలో ప్రతి 15 నిమిషాలకోసారి ప్లేయర్స్ ఆక్సిజన్ను తీసుకొనే అవకాశం కల్పించారు. గ్రౌండ్ పక్కనే చిన్ని చిన్న ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. సరైన సమయంలో ఆటగాళ్లకు ఆక్సిజన్ అందకపోతే వికారం, వాంతులు అయ్యే ప్రమాదం ఉంటుంది.

దీంతో ఈ స్టేడియంలో నిర్వహించిన ఒకే ఒక్క మ్యాచ్లో లాసా చెంగ్టౌ జట్టు విజయం సాధించింది. అయితే ఆక్సిజన్ సరిగ్గా దొరక్క ఇబ్బంది పడటంతో లాసాకు 4 వేల కిలో మీటర్ల దూరంలో ఉన్న హుయ్ఝౌలో మిగతా మ్యాచ్లు నిర్వహించారు. వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన లాసా స్టేడియం భవిష్యత్తు ఈ కారణం చేత ప్రశ్నార్థకంగా మారింది.