హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది రష్యా అతిథ్యమిచ్చిన ఫిఫా వరల్డ్ కప్కు విశేష ఆదరణ లభించిందని ఫిఫా నిర్వాహకులు తెలిపారు. రష్యా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ టోర్నీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులు వీక్షించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
2018 ఫిఫా వరల్డ్కప్ టోర్నమెంట్ను రికార్డు స్థాయిలో 3.572 బిలియన్ల మంది ఫుట్బాల్ ప్రేక్షకులు చూసినట్లు తమ ఆడిట్లో వెల్లడైందని పేర్కొంది. ఫ్రాన్స్-క్రోయేషియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ను ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 112 కోట్ల మంది ప్రత్యక్ష ప్రసారంలో చూసినట్లు ఫిఫా వెల్లడించింది.
జులై 15న రష్యాలోని లుజ్నికి స్టేడియంలో జరిగిన ఈ పైనల్ మ్యాచ్లో క్రొయేషియాపై ఫ్రాన్స్ గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. ఇక, జూన్ 14న టోర్నీ మొదలైనప్పటి నుంచి ముగిసేలోపు 357 కోట్ల మంది.. అంటే ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది కనీసం ఒక్క నిమిషమైనా ప్రపంచకప్ను వీక్షించినట్లు కూడా ఫిఫా తెలిపింది.
ఇది ప్రపంచ జనాభాలో సగానికి కన్నా ఎక్కువేనని వివరించింది. అత్యధిక అభిమానులను సొంతం చేసుకున్న ఫుట్బాల్ టోర్నీని నాలుగేళ్ల వయస్సు గల పిల్లల నుంచి వృద్ధుల వరకు వీక్షించినట్లు పేర్కొంది. డిజిటల్ ఫ్లాట్ఫామ్స్ ద్వారా కూడా అధిక సంఖ్యలో టోర్నీలోని మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశారని ఫిఫా వెల్లడించింది.