కోల్కతా: సొంత అభిమానుల మద్దతుతో కేరళ బ్లాక్ బస్టర్స్ ఎఫ్ సి జట్టు చేసే గర్జనలకు తాము భయపడబోమని అట్లెటికో డి కోల్కతా హెడ్ కోచ్ జోస్ మొలీనా వ్యాఖ్యానించాడు. ఆదివారం ఐఎస్ఎల్ 3 ఎడిషన్ టైటిల్ కోసం కోచిలో కేరళ, కోల్ కతా జట్ల మధ్య ఫైనల్స్ జరుగనున్న సంగతి తెలిసిందే. తన జట్టుతోపాటు కోచికి బయలుదేరడానికి ముందు మొలీనా మీడియాతో మాట్లాడాడు.
ఆట పట్ల మక్కువతో స్టేడియంకు తరలివచ్చే అభిమాన జన సందోహం ముందు ఆడేందుకు తాము అత్యంత ఆసక్తితో తహతహలాడుతున్నట్లు చెప్పాడు. 'మేం కోచిలో ఇప్పటికే మ్యాచ్ ఆడాం. మేం ఇప్పటికి విజయాన్ని సాధించామం. అక్కడ (కోచిలో) గొప్ప సానుకూల వాతావరణం నెలకొంది' అని మొలీనా అన్నాడు.
'నేను మా ఆటగాళ్లందరితో మాట్లాడా. అంతకంటే మెరుగైన వాతావరణం కనుగొనడం చాలా కష్టం. కేరళకు ఫ్యాన్స్ మద్దతు ఉన్నా అది పెద్ద విషయమేం కాదు. మా ప్లేయర్లు కూడా వారి ముందు ఆడాలని కోరుకుంటున్నారు' అని తెలిపాడు. ఇటువంటి వాతావరణంలోనే ప్రతి ఆటగాడు ఆడాలని కోరుకుంటాడని అన్నాడు.

రెండేళ్ల క్రితం 2014లో ఐఎస్ఎల్ ప్రారంభ సంవత్సరం టైటిల్ కోసం ముంబైలో జరిగిన ఫైనల్స్లోనూ కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టును ఓడించిన చరిత్ర అట్లెటికో డి కోల్కతా సొంతం. గతంలో ఒకసారి ఓటమి పాలైన కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు అదనపు అడ్వాంటేజీ ఏమీ లేదన్నాడు. గతాన్ని తాము మరిచిపోయామని, గతంలోనూ కేరళ జట్టుపై తాము ఓడిపోలేదని, భవిష్యత్లోనూ ఓడిపోబోమని ధీమా వ్యక్తం చేశాడు.
తాను గతానికి ప్రాతినిధ్యం వహించడం లేదని, వర్తమానంలో ఉన్నానని చెప్పాడు. తాము సాధ్యమైనంత మేరకు మెరుగైన ఆటే ఆడతామన్నాడు. 'కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు మంచి ఆటగాళ్లు ఉన్నారు. వారు వారి సొంత స్టేడియంలో ఫైనల్స్ మ్యాచ్ ఎదుర్కొంటున్నారు. కానీ దానివల్ల వారికి ఎటువంటి అడ్వాంటేజ్ ఉండదనే నేను భావిస్తున్నా. ఏ జట్టైనా మెరుగైన ఆట ఆడేందుకు ప్రయత్నిస్తుంది' అని మొలీనా చెప్పాడు.
కెనడియన్ స్ట్రయికర్ ఇయాన్ హుమ్ ఇప్పటివరకు అట్లెటికో డి కోల్కతా జట్టు ఏడుసార్లు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తాము ప్రతీసారి ఫైనల్స్ కు దూసుకెళ్లగలమని తొలి నుంచి విశ్వసిస్తున్నామని తెలిపాడు. ప్రస్తుతం తాము గొప్ప సానుకూల వాతావరణాన్ని ఎదుర్కోనున్నామని, పిచ్పై తమ వంతు విధులు నిర్వర్తిస్తామని అన్నాడు.
తాము చాలా కష్టపడి ఆడతామని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. కేరళ జట్టుతో ఫైనల్స్లో తలపడేందుకు సిద్ధంగా ఉన్నామని ఇయాన్ హుమ్ తెలిపాడు. ఇంతకుముందు ఇయాన్ హుమ్ కేరళ బ్లాక్ బస్టర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన మాజీ టీంతో ఫైనల్స్లో తలపడనుండటం ఆసక్తిగా ఉన్నదని, అది పూర్తిగా జన సందోహంతో నిండిన కార్యక్రమంగా మారుతుందన్నారు.
'ఇది కేరళ బ్లాక్ బస్టర్స్ కు తొలి ఫైనల్స్, ప్రత్యేకమైంది. మాకు ఇదొక మరో మ్యాచ్ మాత్రమే. మేము ఆందోళనకు గురి కావడం లేదు. విజయం సాధించేందుకు వీలుగా మేం మెరుగైన ఆటతీరు ప్రదర్శించడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం' అని చెప్పాడు. కేరళ జట్టులో సమర్థులైన ఆటగాళ్లు ఉన్నారన్న సంగతి తమకు తెలుసునని ఇయాన్ హుమ్ అన్నాడు.
కేరళలోనే ఫైనల్స్ ఆడడం వల్ల వారికి సానుకూలంగా ఉంటుందని, అయితే తమదైన శైలిలో మ్యాచ్ ఆడతామన్నాడు. తమ వ్యూహానికి అనుగుణంగా టైటిల్ పోరులో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని హుమ్ తెలిపాడు.