గౌహతి: గత రెండు ఎడిషన్లలో ఎటువంటి ప్రతిభ చూపని నార్త్ ఈస్ట్ యునైటెడ్ క్లబ్ జట్టు ఈ దఫా అండర్ డాగ్ గా దూసుకొస్తున్నది. డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ మాత్రం ఇంకా గత స్మ్రుతులతోనే కాలం గడుపుతున్నది. ఈ తరుణంలో గురువారం సాయంత్రం జరిగే మ్యాచ్ లో చెన్నైయిన్ జట్టుపై విజయం సాధించి.. సెమీస్ దిశగా మరో అడుగు ముందుకు వేయాలని జాన్ అబ్రహం జట్టు తలపోస్తున్నది.
డిఫెండింగ్ చాంపియన్ చెన్నైతో గెలుపొందడం ద్వారా ఆ రెండు జట్ల మధ్య పాయింట్లలో చాలా తేడా లభిస్తుంది. ప్రస్తుతం ఐదు మ్యాచ్ లు ఆడిన నార్త్ఈస్ట్ 10 పాయింట్లతో టేబుల్ లో మొదటి స్థానంలో నిలవగా, చెన్నై కేవలం ఐదు పాయింట్లతో ముందుకు వచ్చేందుకు పోరాడుతున్నది.

నార్త్ఈస్ట్ జట్టు ఐఎస్ఎల్ 3 ఎడిషన్ ప్రారంభ మ్యాచ్ కేరళ బ్లాక్ బస్టర్స్ తో విజయం నుంచే పాయింట్ల పట్టికలో అగ్రభాగాన సాగుతోంది. ఈ తరుణంలో గురువారం సాయంత్రం నార్త్ ఈస్ట్, చెన్నైయిన్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. నార్త్ఈస్ట్ మేనేజర్ నెలో వింగాడ ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఈ జట్టు, టీం సభ్యులతో నార్త్ఈస్ట్ లోని గౌహతి, ఇతర ప్రాంతాలు గర్వపడే పరిస్థితి నెలకొంది. మేం ఇప్పటికే పది పాయింట్లు పొందాం. మంచి ఫలితం పొందినా సెమీ ఫైనల్స్ కు చేరుకొనేందుకు అవసరమైన పాయింట్లు పొందలేదు' అని చెప్పారు.
ఇంతకుముందు ఢిల్లీ డైనమోస్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో నార్త్ ఈస్ట్ 1 - 1 స్కోర్ తేడాతో డ్రా చేసుకున్నది. ఈ లీగ్ లో గురువారం జరిగే మ్యాచ్ రెండువైపులా అనుకూలంగా ఉన్నదని వింగాడ తెలిపాడు. 'మేం మరిన్ని పాయింట్లు పొందాల్సిన అవసరం ఉంది. మేం మరిన్ని పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. మా టీం ఎవరితోనైనా, ఎక్కడైనా ఆడి విజయం సాధించే సత్తా ఉంది. కానీ మేం గెలవడానికే ఆడుతున్నాం అనుకోండి. నేను ఈ లీగ్ లో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ దేశంలో వాతావరణం ఎంతో మెరుగ్గా ఉంది' అని వింగాడ అన్నాడు.
తమ టీమ్ కు ఢిల్లీ కోచ్ జంబ్రొట్టా నుంచి ప్రశంసలు రావడం మామూలు విషయం కాదన్నారు. ప్రస్తుత లీగ్ లో నార్త్ఈస్ట్ క్లబ్ అత్యుత్తమ జట్టు అని జంబ్రొట్టా ప్రశంసించాడు. మరోవైపు చెన్నైయిన్ గత సీజన్ టైటిల్ సాధించిన స్మ్రుతులతోనే కాలం గడుపుతున్నది. కానీ గౌహతి పర్యటనను ఆ జట్టు మరిచిపోతారని అంతా ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ఈ సీజన్ తోనే కోచ్ మాట్టరాజీ గడువు కూడా పూర్తయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్లేయర్ల మధ్య అంతర్గత ఘర్షణ వల్ల హర్మాన్జోత్ ఖర్బా వెళ్లిపోవాల్సి వచ్చింది. తొలి ఎడిషన్ లో నార్త్ ఈస్ట్ పై చెన్నైయిన్ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కానీ నార్త్ ఈస్ట్ తొలి సీజన్ లో పాయింట్ల సాధనకే కష్ట పడింది.
ఎఫ్ సి గోవాపై విజయం నింపిన విశ్వాసంతో గౌహతిలో నార్త్ఈస్ట్ పై విజయం సాధిస్తామని మాట్టరాజీ ఆశాభావం వ్యక్తంచేశాడు. చెన్నైయిన్ ఈ దఫా సీజన్ లో హాన్స్ ముల్డర్, మెహ్రాజుద్దీన్ ల సహకారంతో తొలిసారి ఎఫ్ సి పుణెపై విజయం సాధించింది. అట్లెటికో డీ కోల్ కతాతో మ్యాచ్ డ్రా చేసుకున్న చెన్నైయిన్.. ఢిల్లీ డైనమోస్ చేతిలో ఓటమి పాలైంది.
మాట్టరాజీ ఈ సందర్భంగా మాట్లాడుతూ 'మేం పూర్తిగా సానుకూల మానసిక స్థితితో గౌహతికి వచ్చాం. విజయంపై ఆర్తితో మనస్సు పెట్టి ఆడాలని మా కుర్రాళ్లకు సూచించా. అప్పుడే మనం గెలువగలం అని చెప్పా. ఒకవేళ మనం గెలవలేకపోతే టీం పాయింట్ల పట్టికలో దిగువకు వెళ్లిపోతుందని హెచ్చరించా' అని తెలిపాడు. ప్రస్తుతం ఐదు పాయింట్లతో చెన్నైయిన్ పాయింట్ల టేబుల్ లో ఆరో స్థానంలో నిలుచుంది.