న్యూఢిల్లీ: భారత్లో పుట్బాల్కు ప్రజాదరణ పెంచే ఉద్దేశ్యంతో ప్రారంభం కానున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ట్రోఫీని ఆదివారం పుట్ బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ (ఎఫ్ఎస్డీ) ఛైర్పర్సన్ నీతా అంబానీ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఆయా ప్రాంజైజీల తరుపున బరిలోకి దిగబోతున్న అంతర్జాతీయ పుట్బాల్ దిగ్గజాలు ఫ్రెడెరిక్ జుంగ్ బర్గ్, డెల్ పియరో, క్యాప్ డెవిలా, డేవిడ్ ట్రెజెగుట్, రాబర్ట్ పిరాస్, లూయిస్ గార్సియా, డేవిడ్ జేమ్స్ పాల్గోన్నారు.

ఈ కార్యక్రమంలో నీతా అంబానీ మాట్లాడుతూ ఇది నిజంగా మా అందరికీ చిరస్మరణీయమైన రోజు. ఇండియన్ సూపర్ లీగ్ ట్రోపీని అవిష్కరించేందుకు నేను ప్రపంచ పుట్ బాల్ దిగ్గజాల సరసన నిలబడ్డాను. విశ్వవ్యాప్తంగా వీరు ఇప్పటికే ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. భారత్లో కూడా ఈ ట్రోపీ ప్రేరణగా నిలుస్తుందని అన్నారు.
ఫ్రేజర్ అండ్ హాస్ డిజైన్ చేసిన ఈ ట్రోపీ ఎత్తు 26 అంగుళాలు. ఈ ట్రోఫీ పైభాగంలో ఇండియన్ సూపర్ లీగ్ లోగోను ముద్రించారు. ఈ సూపర్ లీగ్లో మొత్తం 8 జట్లు ఉన్నాయి.
మాజీ క్రికెట్ ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ ఇందులో రెండు జట్లకు యజమానులుగా ఉన్నారు. ఇండియన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానుంది.