
హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) నాలుగో సీజన్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. బుధవారం ముంబై-పుణె జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అభిమానుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వివరాల్లోకి వెళితే... ఐఎస్ఎల్ టోర్నీలో భాగంగా బుధవారం ముంబై-పూణె జట్ల మధ్య పుణెలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మ్యాచ్ జరిగింది. మ్యాచ్ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. ఏయే జట్లకు చెందిన ఆయా అభిమానులు తమ తమ జెండాలతో ప్రోత్సహిస్తున్నారు.
అదే సమయంలో స్టేడయంలోని గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తమ తమ జట్లకు మద్దతుగా నినాదాలు చేస్తూ ఒకరిపై మరొకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది. ఇంతలో దీనిని గుర్తించిన భద్రతా సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి పుణె అభిమానులను వేరేచోటికి తరలించారు.
దీంతో పరిస్థితి సద్దుమణగడంతో మిగతా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. పూణె అభిమానులే కావాలని ముంబై అభిమానులతో గొడవ పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.