ఫిఫా వరల్డ్ కప్ 2022లో మరో సంచలనం నమోదైంది. నాకౌట్స్ మ్యాచ్లో బలమైన స్పెయిన్ను పసికూన మొరాకో ఓడించింది. ఎక్స్ట్రా టైం ఇచ్చినా రెండు జట్లు కనీసం ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ ద్వారా విజేతను నిర్ణయించాలని అంపైర్లు డిసైడ్ అయ్యారు. తమకు వచ్చిన అవకాశాలను స్పెయిన్ ఉపయోగించుకోలేకపోయింది. అదే సమయంలో మొరాకో జట్టు మూడు గోల్స్ చేసి క్వార్టర్స్కు దూసుకెళ్లింది.
ఈ మ్యాచ్ ఆరంభం నుంచి స్పెయిన్ ఆధిపత్యం చెలాయించింది. మొదటి అర్ధభాగంలో 80 శాతం సమయం బంతిని తమ కంట్రోల్లో ఉంచుకుంది. కానీ గోల్స్ మాత్రం చేయలేకపోయింది. బంతి తమ వద్ద ఎక్కువ సేపు ఉన్నప్పటికీ స్పెయిన్ తగినన్ని అవకాశాలు సృష్టించుకోలేకపోయింది. ఈ క్రమంలో మొదటి హాఫ్ను రెండు జట్లు 0-0తో ముగించాయి.సెకండ్ హాఫ్ను కూడా స్పెయిన్ జోరుగా ఆరంభించింది. డిఫెన్స్లో పడినా కూడా మొరాకో కూడా గట్టిగా పోరాడింది. దీంతో రెండు జట్లు గోల్స్ చెయ్యలేకపోయాయి. ఈ క్రమంలో ఎక్స్ట్రా టైం ఇస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
మరో అరగంట సేపు రెండు జట్లు విజయం కోసం పోరాడాయి. కానీ ఫలితం మాత్రం రాలేదు. ఈ సమయంలో రెండు జట్లు కూడా డిఫెన్స్ ఆట ఆడటంతో చాలా నిదానంగా సాగిన మ్యాచ్ ఫలితం లేకుండానే ముగిసింది. దీంతో పెనాల్టీ షూటవుట్ ద్వారా విజేతను నిర్ణయించాలని అంపైర్లు డిసైడ్ అయ్యారు. ఈ షూటవుట్లో స్పెయిన్ తమ అవకాశాలను చేజార్చుకుంది. అదే సమయంలో మొరాకో జట్టు మూడు గోల్స్ చేసి 3-0తో విజయం సాధించింది. దీంతో ఫుట్బాల్ చరిత్రలో తొలిసారి మొరాకో జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది.