
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం నాడు అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య జరిగే వరల్డ్ కప్ ఫైనల్ కోసం స్టేడియాన్ని సిద్ధం చేస్తున్న ఒక వర్కర్ ఎత్తు నుంచి కింద పడి మరణించాడు. ఈ విషయాన్ని ఖతర్ అధికారులు వెల్లడించారు. లుసైల్ స్టేడియం వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి ఈ ప్రమాదంలో మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఖతర్లో వరల్డ్ కప్ పనుల కోసం వచ్చిన వారిలో అత్యధికులు కెన్యా, తదితర ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారే కావడం గమనార్హం. అప్పటి నుంచి ఖతర్పై పలు దేశాలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఇక్కడకు వస్తున్న వలస కార్మికులకు సరైన రక్షణ లభించడం లేదని వాదిస్తున్నాయి. అయితే తమ దేశంలో కార్మికులకు అవసరమైన అన్ని వసతులు, రక్షణ కల్పించామని ఖతర్ అంటోంది. ఈ వరల్డ్ కప్ పనుల కోసం సుమారు 20 లక్షల మంది వలస కార్మికులు ఖతర్ చేరుకున్నట్లు అంచనా. ఇంత మందికి సరైన రక్షణ కల్పించడం లేదని ఆ దేశంపై విమర్శలు కూడా వస్తున్నాయి.
జాన్ న్యూ కిబో అనే వ్యక్తి ఏ దేశస్థుడనే విషయం మాత్రం ఖతర్ అధికారులు వెల్లడించలేదు. అలాగే అతను ఎలా కింద పడిపోయాడనే విషయంపై అధికారులు అత్యవసరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జాన్ కుటుంబానికి ఈ విషయం తెలియజేశామని, ప్రమాదం గురించి దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. జాన్ పని చేస్తున్న లుసైల్ స్టేడియంలోనే ఆదివారం నాడు అర్జెంటీనా, ఫ్రాన్స్ దేశాల మధ్య ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ జరిగే స్టేడియం వద్ద ఇలా ఒక సెక్యూరిటీ గార్డు మరణించడంపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు.