హైదరాబాద్: ప్రపంచ కప్ గెలుచుకోవడం మెస్సీ జీవిత లక్ష్యం. ప్రపంచ ఫుట్బాల్ గడగడలాడించిన మారడోనా ఆశ. క్రితం ప్రపంచ కప్లో ఫైనల్ వరకూ వెళ్లి వెనుదిరిగినందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో అర్జెంటీనా జట్టు. అన్నీ తేలిపోయేలా జరిగింది రెండు మ్యాచ్లలో ఆ జట్ల ప్రదర్శన. అవును ప్రపంచ కప్ మొదలైనప్పటి నుంచి భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన అర్జెంటీనా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.
ఆ జట్టు స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ ఘోరంగా విఫలమవుతుండటంతో తొలి మ్యాచ్ 1-1తో ఐస్లాండ్పై డ్రా చేసుకున్న అర్జెంటీనా.. ఆ తర్వాత క్రొయేషియా చేతిలో 0-3 తేడాతో ఓడింది. ఇక అర్జెంటీనా నాకౌట్ రేసులో నిలవాలంటే మంగళవారం నైజీరియాతో జరగనున్న మ్యాచ్లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్లో అర్జెంటీనా గెలిచి.. నాకౌట్ దశకి అర్హత సాధిస్తుందని ఆ జట్టు దిగ్గజ ఫుట్బాలర్ మారడోనా ధీమా వ్యక్తం చేశాడు.
'నైజీరియా చాలా ప్రమాదకరమైన జట్టు. ప్రపంచకప్లో వారిపై చాలాసార్లు అర్జెంటీనా ఆడి గెలిచింది. 2014 ఫిఫా ప్రపంచకప్లోనూ నైజీరియాను ఓ సారి ఓడించాం. కాబట్టి.. మానసికంగా ఇప్పుడు అర్జెంటీనాదే పైచేయి. అయితే.. ఇప్పటికే నైజీరియా మూడు పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఒకవేళ అర్జెంటీనాతో మ్యాచ్ను డ్రాగా ముగించుకున్నా.. ఆ జట్టు నాకౌట్ చేరాలంటే ఐస్లాండ్ జట్టు క్రొయేషియాని ఓడించాల్సి ఉంటుంది. అయితే.. నైజీరియాకి ఎలాంటి అవకాశమివ్వకుండా నాకౌట్ చేరాలని అర్జెంటీనా ఆటగాళ్లు బలంగా కోరుకుంటున్నారు' అని మారడోనా వెల్లడించాడు.
సెయింట్ పీటర్స్బర్గ్ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్లో అర్జెంటీనా జట్టు భవితవ్యం తేలనుంది. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 11:30గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.