చెన్నై: చివరి క్షణంలో నార్త్ఈస్ట్ గోల్ సాధించడం వల్లే మ్యాచ్ డ్రాగా ముగిసిందని డిఫెండింగ్ చాంపియన్స్ చెన్నైయిన్ ఎఫ్ సి కోచ్ మార్కో మాట్టరాజీ వ్యాఖ్యానించాడు. శనివారం చెన్నైలో నార్త్ఈస్ట్ తో జరిగిన మ్యాచ్ నాటకీయ ఫక్కీలో 3 - 3 స్కోర్ తేడాతో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే సూపర్ మాచన్లకు ఇంకా సెమీ ఫైనల్స్ బెర్త్ అవకాశాలు ఉన్నాయని మాట్టరాజీ వ్యాఖ్యానించాడు.
చివరి క్షణాల్లో తమపై ఒత్తిడి తేవడంతో వెనుకబడ్డామని అంగీకరించాడు. 3 - 3 తేడాతో మ్యాచ్ డ్రాగా ముగిసిపోతుందని తానెప్పుడూ ఊహించలేదన్నాడు. నార్త్ఈస్ట్ జట్టు డ్రా కోసమే ఇక్కడకు వచ్చిందన్నాడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా చివరి క్షణంలో ప్రత్యర్థి జట్టు గోల్ చేసే అవకాశం కల్పించిందని, పుణెతో తమకు జరిగిన మ్యాచ్ లోనూ 84వ నిమిషంలో హబాస్ సేనకు గోల్ చేసే అవకాశం వదులుకోవాల్సి వచ్చిందన్నాడు.
డిఫెండింగ్ చాంపియన్లుగా ఐఎస్ఎల్ 3 ఎడిషన్లో ప్లే ఆప్ దశలోనే వైదొలిగే అవకాశాలు ఉన్నా తనకు ఆనందంగానే ఉన్నదన్నాడు. తమ జట్టు ప్రతిభ పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపాడు. తదుపరి ఎఫ్ సి గోవాతో తలపడతామని చెప్పాడు.

'మాది పూర్తిగా కొత్త టీం. అనుభవ రాహిత్యంతో వెనుకబడి ఉన్నాం. అనిబల్ రోడ్రిగెజ్ మాదిరిగా ఫ్రీ కిక్ తో పుణె స్కోర్ సాధించినా, ముంబై చేతిలో ఓటమి పాలైనా నేను బాధపడను. మా కుర్రాళ్ల ఆటతీరుకు అనుగుణంగా వారిని అభినందిస్తాను' అని చెప్పాడు.
బ్యాక్ లైన్ బలహీనంతోపాటు డిఫెన్స్ విభాగంలో వెనుకబడటం వల్ల తాము 20 గోల్స్ సమర్పించుకోవాల్సి వచ్చిందన్నాడు. అలాగని ఒక విభాగంపై విమర్శలు చేయడం సరి కాదన్నాడు. ప్రస్తుత సీజన్లో ఈ ఏడాది టోర్నీలో జట్టు ప్రతిభా పాటవంలో తన పొరపాట్లు, బలహీనతలు ఉన్నాయని యాజమాన్యం భావిస్తే తాను కోచ్ గా వైదొలగాల్సి వస్తుందన్నాడు.
తాను బాగానే పనిచేస్తున్నానని భావిస్తే మాత్రం తదుపరి కొనసాగింపుపై ఆలోచించుకోవచ్చునన్నాడు. ఏదిఏమైనా తామంతా మంచి మిత్రులుగా ఉండిపోతామని చెప్పాడు. గురువారం నాడు చెన్నైయిన్ జట్టు పాటోర్డాలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో గోవా జట్టుతో తలపడుతుంది.
చెన్నై మిడ్ ఫీల్డర్ ఎలానో రిటైర్డ్
రియో డీ జెనెరియో: మాంఛెస్టర్ సిటీ మాజీ ప్లేయర్, ఐఎస్ఎల్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నయిన్ ఎఫ్ సి ప్లేయర్ ఎలానో ప్రొఫెషనల్ ఫుట్ బాల్ క్రీడ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. బ్రెజిల్ జాతీయ జట్టుకు 50 సార్లు సారధ్యం వహించిన ఎలానో క్లబ్ కెరీర్.. షెక్తార్ డొనెట్స్క్, మాంఛెస్టర్ సిటీ, గలాతసారాయి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
ఈ 35 ఏళ్ల బ్రెజిలియన్ శాంతోస్ బ్రెజిల్ క్లబ్ కోచ్గా యువ కుర్రాళ్లకు శిక్షణ ఇవ్వనున్నాడని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. శాంతోస్ వెబ్ సైట్ ఈ మేరకు ఎలానో ప్రొఫెషనల్ ఫుట్ బాల్ కెరీర్ నుంచి వైదొలుగుతున్నారని ప్రకటించింది. ఆయన ఇక నుంచి తమ జట్టుకు వచ్చే సీజన్ నుంచి డోర్నివాల్ జూనియర్స్ జట్టుకు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తారని వెబ్ సైట్ తెలిపింది. శాంతోస్ జట్టుకు 321 సార్లు ప్రాతినిధ్యం వహించిన 68 గోల్స్ సాధించాడు. 2002, 2004లలో బ్రెజిలియన్ సిరీ ఎ టైటిళ్లను జట్టు గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇపిఎల్ టైటిల్పై మౌరిన్హో విశ్వాసం
లండన్: ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) టైటిల్ గెలుచుకునేందుకు తమకు ఇంకా అవకాశాలు ఉన్నాయని మాంఛెస్టర్ యునైటెడ్ క్లబ్ మేనేజర్ జోస్ మౌరిన్హో చెప్పాడు. చెల్సియాతో జరిగిన మ్యాచ్ లో తేలిపోయిన మాంఛెస్టర్ యునైటెడ్ ఆదివారం వెస్ట్ యునైటెడ్ తో తలపడనున్నది. 'నేను 18 నెలల క్రితం టైటిల్ కోల్పోయా. నా ముందు పది పాయింట్లు ఉన్నాయి. ఇదే నాకు అడ్వాంటేజ్. ఒక నెలలోనే కోలుకోగలం' అని మౌరిన్హో చెప్పాడు.
తాము కోలుకుని ఇతరులపై పట్టు సాధిస్తామన్నాడు. గత వారం అర్సెనల్ పై జరిగిన మ్యాచ్ లో దురద్రుష్టవశాత్తు 1 - 1 స్కోర్ తేడాతో మ్యాచ్ డ్రాగా ముగించామని అంగీకరించాడు. ఆదివారం జరిగే మ్యాచ్ లో గెలుపొందితే తాము మూడు పాయింట్లు పొందగలమన్నాడు. తమ జట్టు విజయాలు సాధిస్తూ అంతరాయం తగ్గింపుపైనే సాధారణంగా ద్రుష్టి సారిస్తుందన్నాడు. ఇపిఎల్ లో 4 -0 స్కోర్ తేడాతో మ్యాచ్ లు ముగియడం చాలా అరుదని తెలిపాడు. జట్ల మధ్య సమతుల్యత ఉన్నదని ఆయన అన్నాడు. ప్రతి జట్టుతో జరిగే మ్యాచ్ చాలా కష్టంగా ఉంటుందన్నాడు. తాము నాలుగు, ఐదు మ్యాచ్ లు గెలుపొందితే తిరిగి పుంజుకోగలమన్నాడు.