హైదరాబాద్: మనిషి అనేవాడికి బలహీనత సర్వ సాధారణ విషయం. ఇది కొన్ని సందర్భాల్లో క్రీడాకారులకు కూడా వర్తిస్తుంది. మ్యాచ్ గెలిచేందుకు శత విధాలా ప్రయత్నించే వారు.. నియమ నిబంధనలకు అనుగుణంగానే పోరాడేందుకు సిద్ధపడతారు. ఇలా ఆటగాళ్లు వారికి కలిసొచ్చిన వస్తువు కూడా ఏదైనా ఉంటే వాటిని వెంట తీసుకెళ్తుంటారు. ఇలాంటి నమ్మకాలు అర్జెంటీనా ఆటగాడు మెస్సీకి కూడా ఉన్నాయి.ఆ విషయాన్ని మెస్సీనే బహిర్గతమే చేశాడు.
రష్యా వేదికగా ఫిఫా ప్రపంచకప్ పోటీలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా నైజీరియాతో జరిగిన మ్యాచ్లో విజయానికి ఇదే కారణమంటున్నాడు మెస్సి. నాకౌట్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అర్జెంటీనా 2-1 తేడాతో నైజీరియాపై గెలుపొందింది. ఈ ప్రపంచకప్లో మెస్సి గోల్ చేసింది ఈ మ్యాచ్లోనే. మ్యాచ్ అనంతరం మెస్సి మీడియాతో మాట్లాడుతుండగా... ఓ రిపోర్టర్కు మెస్సీ ఇలా సమదానమిచ్చాడు.
'మెస్సీ.. అమ్మ ఇచ్చిన ఎరుపు రంగు తాడును ఈ మ్యాచ్లోనూ ధరించావా' అని అడిగాడు. దానికి బదులుగా మెస్సీ అవునని తెలపడంతో.. రిపోర్టర్ మేము కూడా చూడొచ్చా అని అడిగాడు. దాంతో మెస్సీ మోకాలికి ఉన్న తాడును చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. 'ప్రపంచం మెచ్చిన ఆటగాళ్లకు కూడా నమ్మకాలు ఉంటాయి' అని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
మెగా ప్రపంచకప్ టోర్నీ ఆరంభమైనప్పటి నుంచి మెస్సీ ఈ తాడును ధరిస్తున్నాడు. ఐస్లాండ్తో తొలి మ్యాచ్ డ్రాకాగా, క్రొయేషియాతో ఓడింది. ఇక నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో నైజీరియాపై విజయం సాధించి అర్జెంటీనా నాకౌట్కు చేరుకుంది. కాగా, అర్జెంటీనా తర్వాతి మ్యాచ్లో ఫ్రాన్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ఫేవరేట్గా ఫ్రాన్స్ జట్టు బరిలోకి దిగనుంది.