
హైదరాబాద్: అర్జెంటీనా మాజీ ఫుట్బాలర్ డిగో మారడోనా.. బంపర్ ఆఫర్ ప్రకటించాడు. అర్జెంటీనా-నైజీరియా మ్యాచ్లో అస్వస్థతకు గురైన మారడోనా ఆరోగ్యం కుదుటపడిన అనంతరం.. లాయర్ ద్వారా భారీ బహుమతిని ప్రకటించాడు. 'నేను చచ్చిపోయానంటూ పుకార్లు పుట్టించిన వ్యక్తిని పట్టిస్తే 10వేల అమెరికన్ డాలర్లను రివార్డుగా అందజేస్తాను' అంటూ మీడియా ముఖంగా మారడోనా తెలియజేశాడు.
మంగళవారం అర్జెంటీనా-నైజీరియా మధ్య మ్యాచ్ అనంతరం మారడోనా స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఓ అజ్ఞాన వ్యక్తి మారడోనా చనిపోయాడంటూ వీడియో మెసేజ్ను సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
తాను ఆరోగ్యంగా ఉన్నానని, కోలుకున్నానని, బీపీ తగ్గడంతోనే అస్వస్థతకు గురయ్యానంటూ ఆ తర్వాత మారడోనా తెలిపారు. దీంతో అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, తాజాగా మారడోనా తాను చనిపోయానంటూ పుకార్లు పుట్టించిన వ్యక్తిని పట్టించిన వారికి సుమారు పది వేల అమెరికన్ డార్లను రివార్డుగా అందజేస్తానని వెల్లడించాడు. ఈ వార్త విని అతని కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురైయ్యారని మారడోనా లాయర్ తెలియజేశారు.
'ఈ సందర్భంగా అభిమానులకు ఒక విన్నపం. అర్జెంటీనా-నైజీరియా మ్యాచ్ అనంతరం నేను ఆస్పత్రి పాలయ్యాను. ఆస్పత్రిలో నేను గుండె నొప్పితో మరణించానంటూ ఓ వ్యక్తి ఒక వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. అభిమానులారా ఈ వీడియోను రూపొందించిన వ్యక్తిని నాకు అప్పజెప్పిన వారికి సుమారు 10వేల అమెరికన్ డాలర్లను రివార్డుగా అందజేస్తా' అని మారడోనా తెలిపాడు.
నైజీరియాపై విజయంతో నాకౌట్కి అర్హత సాధించింది అర్జెంటీనా. టోర్నీలో భాగంగా నాకౌట్లో అర్జెంటీనా.. ఫ్రాన్స్తో తలపడనుంది. శనివారం ఈ మ్యాచ్ జరగనుంది.