మాంచెస్టర్ సిటీ ఓడిపోవడంతో:
ప్రమాదకర కరోనా వైరస్ కారణంగా మూడు నెలల తర్వాత కట్టుదిట్టమైన జాగ్రత్తల మధ్య మొదలైన ఈపీఎల్ లీగ్లో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన లివర్పూల్ 86 పాయింట్లతో టాప్ లేపింది. మాంచెస్టర్ సిటీ (63), లీసెస్టర్ సిటీ (55), చెల్సియా (54)లు.. లివర్పూల్ దరిదాపుల్లో కూడా లేవు. మాంచెస్టర్ సిటీతో జరిగిన మ్యాచ్లో చెల్సి 2-1తో విజయం సాధించడంతో లివర్పూల్కు కప్ ఖరారైంది. పాయింట్ల పట్టికలో మాంచెస్టర్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
మూడు దశాబ్దాల తర్వాత:
ఈ సీజన్లో 31 మ్యాచ్ల్లో 86 పాయింట్లు సాధించిన లివర్పూల్ ప్రస్తుతం మాంచెస్టర్ కంటే 23 పాయింట్ల ముందంజలో ఉంది. మరోవైపు మాంచెస్టర్ సిటీ ఇంకా 7 మ్యాచ్లు ఆడాల్సి ఉన్నా.. అవన్నీ గెలిచినా అది 84 పాయింట్లకే చేరుకుంటుంది. దీంతో 1990 తర్వాత లివర్పూల్ తొలిసారి ప్రీమియర్ లీగ్ టైటిల్ను సొంతం చేసుకుంది. లీగ్ మొదలైన 1888 నుంచి ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు మిగిలుండగానే కప్ను దక్కించుకున్న తొలి జట్టుగా లివర్పూల్ నిలిచింది. లివర్పూల్ ఈపీఎల్ టైటిల్ను రికార్డు స్థాయిలో 19వ సారి దక్కించుకోవడం మరో విశేషం. మాంచెస్టర్ యునైటెడ్ 20 టైటిళ్లతో టాప్లో కొనసాగుతున్నది.
నిబంధనలు మరచి ఫ్యాన్స్ హంగామా:
మూడు దశాబ్దాల తర్వాత ఆ జట్టు విజయం సాధించడంతో అభిమానుల సంబరాలు అంబారాన్ని అంటాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదమున్నా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. రంగురంగుల టపాసులతో ఆ ప్రాంతమంతా కళకళలాడింది. ఈ విజయంపై స్పందించిన లివర్పూల్ కెప్టెన్ జుర్గెన్ క్లాప్ ఇది నమ్మశక్యం కాని గెలుపన్నాడు. తాను ఊహించిన దానికంటే తమ జట్టు ఎంతో సాధించిందని సంతోషం వ్యక్తం చేశాడు. గతరాత్రి చెల్సీ, మాంచెస్టర్ల మధ్య జరిగిన మ్యాచ్ను తాను చూశానని.. అదెంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పాడు.