
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు లియోనల్ మెస్సీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం రష్యాలో జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్లో ఆడుతున్న ఈ స్టార్ ఆటగాడు ఈ రోజు 31వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ప్రపంచకప్ సందర్భంగానే మెస్సి పుట్టినరోజు కూడా రావడంతో యావత్ ప్రపంచమంతా అతనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపే పనిలో ఉంది. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా సందేశాలు పంపుతుంటే.. మరికొందరు ప్రత్యేకంగా కానుకలు పంపుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఫిఫా వరల్డ్ కప్లో ఏరోజు ఏమ్యాచ్ | ఫిఫా వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక
ఇంకొందరు నేరుగా విష్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారట. అయితే మాస్కోలో స్థానికంగా ఓ బేకరీ నిర్వాహకులు మాత్రం ఏకంగా అతని రూపంలో ఉండే ఓ చాక్లెట్ విగ్రహాన్నే తయారుచేశారట. 60కిలోల బరువుండే విగ్రహాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన బృందం సుమారు వారం రోజుల పాటు కష్టపడి రూపొందించినట్లు వారు చెప్పారు. మెస్సి పుట్టినరోజు నాడు మెస్సినే బహుమతిగా ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందంటూ వారు తెగ మురిసిపోతున్నారు.
మరోవైపు ఇక్కడే ఉండే బ్రానిట్సీ వాసులు కూడా మెస్సికి ఫిపా ప్రపంచకప్ నమూనాను తయారు చేసి పుట్టిన రోజు కానుకగా పంపారు. టోర్నీలో భాగంగా గురువారం క్రొయేషియాతో జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా 0-3తో ఓటమి చవిచూసి రెండో రౌండ్కు అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. కానీ ఐస్లాండ్పై నైజీరియా గెలవడంతో అర్జెంటీనాకు రెండో రౌండ్కు అవకాశాలు సజీవంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
మరి గ్రూప్ దశలో నైజీరియాతో చివరి మ్యాచ్లో అర్జెంటీనా ఆటగాళ్లు ఏమేరకు రాణిస్తారో.. మెస్సికు అందని ద్రాక్షలా మిగిలిన ప్రపంచకప్ ఈసారైనా దక్కుతుందో లేదో చూడాలి. గ్రూప్-డీలో ఉన్న అర్జెంటీనా ఆడిన రెండింటిలో ఒక మ్యాచ్ను డ్రాగా ముగించగా.. మరొక మ్యాచ్లో ఘోర ఓటమిని ఎదుర్కొంది. దీంతో పాయింట్ల పట్టికలో ఒక్క పాయింట్తో ఆఖరి స్థానంలో ఉంది.