ఫుట్బాల్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ చరిత్ర సృష్టించాడు. చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. అర్జెంటీనా సారధిగా ఫిఫా వరల్డ్ కప్ 2022ను గెలిపించిన మెస్సీ.. అనంతరం టోర్నీలో అత్యుత్తమ ప్లేయర్కు అందించే గోల్డెన్ బాల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఈ టోర్నమెంట్లో మెస్సీ అత్యుత్తమంగా ఆడాడు. మొత్తం ఏడు గోల్స్ నమోదు చేయడంతోపాటు రెండు కీలకమైన అసిస్ట్లు కూడా అందించాడు. దీంతో అతనికి ఈ అవార్డు దక్కడం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు.
ఈ 'గోల్డెన్ బాల్' అవార్డు దక్కడం మెస్సీకి ఇది వరుసగా రెండోసారి. గతంలో 2014లో కూడా వరల్డ్ కప్లో మెస్సీ అత్యద్భుతంగా రాణించాడు. ఆ టోర్నీలో కూడా అర్జెంటీనా ఫైనల్ చేరింది. కానీ జర్మనీ చేతిలో ఓడి రన్నరప్ టైటిల్తో సరిపెట్టుకుంది. ఆ ఏడాది అత్యుత్తమ ఫామ్ కనబరిచిని మెస్సీకి 'గోల్డెన్ బాల్' దక్కింది. ఇప్పుడు మరోసారి అతను ఈ అవార్డు అందుకున్నాడు. ఫుట్బాల్ వరల్డ్ కప్ చరిత్రలో ఒక ప్లేయర్ ఇలా రెండుసార్లు గోల్డెన్ బాల్ అవార్డు దక్కించుకోవడం ఇప్పటి వరకు జరగలేదు. దీంతో మెస్సీ అరుదైన ఘనత సాధించాడు.
ఫ్రాన్స్తో జరిగిన ఫైనల్లో అర్జెంటీనాకు మెస్సీ అదిరే ఆరంభం అందించాడు. ఆట మొదలైన 23వ నిమిషంలోనే అర్జెంటీనాకు పెనాల్టీ కిక్ లభించింది. దాన్ని మెస్సీ గోల్గా మలిచాడు. ఆ తర్వాత డి మరియా కూడా మరో గోల్ చేశాడు. దీంతో అర్జెంటీనా ఆరంభంలోనే 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఎంబాపే వరుసగా రెండు గోల్స్ చేసి మ్యాచ్ను డ్రా చేశాడు. దీంతో ఎక్స్ట్రా టైంకు వెళ్లిందీ మ్యాచ్. ఆ సమయంలో కూడా మెస్సీ మరో గోల్ చేయగా.. ఎంబాపే మరోసారి స్కోర్లు సమం చేశాడు. చివరకు పెనాల్టీ కిక్లలో మాత్రం ఫ్రాన్స్ సత్తా చాటలేకపోయింది. దీంతో 4-2 తేడాతో అర్జెంటీనా ఈ వరల్డ్ కప్ విజేతగా నిలిచింది.