
హైదరాబాద్: అప్పట్లో .. (1982)లో స్పెయిన్లో జరిగిన ఫిఫా వరల్డ్కప్ అర్జెంటీనా మాంత్రికుడు మారడోనా మ్యాజిక్కు ప్రపంచమంతా సాకర్ ఫీవర్తో ఊగిపోయింది. 1982లో జరిగిన ఆ వరల్డ్కప్ తొలిసారి టీవీల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న వాళ్లు సాకర్ మజాను ఆస్వాదించారు. ఈ క్రమంలోనే కోల్కతాకు చెందిన పన్నాలాల్ (85), చైతలీ (76) దంపతులు 1982లో స్పెయిన్లో జరిగిన ప్రపంచకప్ను ప్రత్యక్షంగా వీక్షించినప్పటి నుంచి ఇక ప్రతి ప్రపంచకప్ను ప్రత్యక్షంగా చూడాలని నిర్ణయించుకున్నారు.
ఆ తర్వాత నుంచి ప్రతీ వరల్డ్కప్ మజాను వీరు నేరుగా స్టేడియాల్లో కూర్చుని ఆస్వాదిస్తున్నారు. 1986లో అర్జెంటీనా వరల్డ్కప్ విజేతగా నిలవడం కళ్లారా చూశారు. ఇప్పుడు 10వసారి విశ్వకప్ను వీక్షించేందుకు రష్యా ప్రయాణానికి రెడీ అవుతున్నారు ఈ వృద్ధ దంపతులు. ప్రస్తుతం పన్నాలాల్ వయసు 85 ఏళ్లుకాగా.. ఆయన భార్యకు 76 సంవత్సరాలు.
ఈ నెల 14 నుంచి రష్యాలో ఆరంభం కానున్న ప్రపంచకప్ మ్యాచ్లను చూసేందుకు వెళ్లనున్నారు. ఇది వాళ్లు మైదానంలో చూసే పదో ప్రపంచకప్ కానుంది. '2022 వరకు నా వయసు 90ఏళ్లకు చేరువ అవుతుంది. దాంతో ఖతార్లో జరిగే ప్రపంచకప్కు వెళ్తానో లేదో చెప్పలేం' అని పన్నాలాల్ తెలిపాడు. ప్రపంచకప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలన్న వాళ్ల కోరిక వెనక ఎన్నో త్యాగాలున్నాయి. ఇష్టమైన ఆహారాన్ని సైతం వద్దనుకొని, ఖర్చులు తగ్గించుకొని ప్రతిసారి ప్రపంచకప్కు వెళ్లేందుకు సరిపడా డబ్బు సమకూర్చుకుంటున్నారు. ఈ నెల 14న రష్యా వెళ్లనున్న ఈ దంపతులు 28న తిరిగి రానున్నారు.
'మూడు మ్యాచ్లు చూసేందుకు మాత్రమే టికెట్లు కొనగలిగాం. మరిన్ని టికెట్లు ఇప్పించాల్సిందిగా ఫిఫాను కోరాం. వాళ్ల నుంచి ఎలాంటి స్పందన లేదు. మరికొన్ని టికెట్లు వస్తాయనే ఆశతో ఉన్నాం. మన దగ్గర జరిగిన అండర్-17 ప్రపంచకప్ సందర్భంగా ఫిఫా మాకు ప్రత్యేక వసతులు కల్పించింది' అని పన్నాలాల్ చెప్పాడు. దిగ్గజాలు మారడోనా, పీలే లాంటి ఆటగాళ్లను చూడడం, చారిత్రక 'హ్యాండ్ ఆఫ్ గాడ్' ఘటనకు సాక్ష్యంగా నిలవడం కంటే ఆనందం ఏముంటుంది అని సంతోషంగా చెబుతోంది ఈ జంట. ఈ మెగాటోర్నీకి వెళ్లిరావడమనేది తమకో తీర్థయాత్ర లాంటిదని చెబుతున్నారు.