
ఇటలీ: ప్రకృతి బీభత్సాన్ని ఎదురించలేకపోయినా.. బాధితులను ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తామని ముందుకొస్తున్నారు. వరదల కారణంగా అతలాకుతలమైన కేరళ కోసం ప్రపంచవ్యాప్తంగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు, క్రీడాకారులూ వీరిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ఇటాలియన్ ఫుట్బాల్ క్లబ్ ఒకటి కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఆపన్నహస్తం అందించింది.
కేరళ వరద బాధితులను ఆదుకోవాలని ఇటాలియన్ ఫుట్బాల్ క్లబ్ ఏఎస్ రోమా తమ అభిమానులను కోరింది. ఇందుకోసం తాము ఐదు మ్యాచ్ల్లో ధరించే షర్ట్లను వేలం వేయనున్నట్లు ఆ జట్టు ప్రకటించింది. 'సిరీస్ ఏలో భాగంగా సొంత మైదానంలో ఆడే మొదటి మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు ధరించే షర్ట్లను వేలం వేస్తాం. కేరళ పునర్నిర్మాణం కోసం నిధులను సమీకరిస్తాం' అంటూ ఏఎస్ రోమ జట్టు ట్విటర్లో పేర్కొంది.
సిరీస్లో భాగంగా రోమ్లో ఆగస్టు 28న అట్లాంటా బీసీ జట్టుతో రోమా జట్టు తలపడనుంది. మరోవైపు ఏఎస్ రోమా జట్టు నిర్ణయంతో స్ఫూర్తి పొందిన లివర్పూల్ ఎఫ్సీ, ఎఫ్సీ బార్సిలోనా జట్లు కూడా కేరళ బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చాయి. బాధితులకు సాయం చేయాల్సిందిగా తమ అభిమానులను అవి ట్విటర్లో కోరాయి.
కేరళ బాధితులకు టీమిండియా కెప్టెన్ విరాళం:
మ్యాచ్ గెలిచిన ప్రైజ్ మనీ 1.26 కోట్ల రూపాయలను కేరళ వరద బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటించారు. కేరళ బాధితుల పట్ల కోహ్లీ చూపించిన ఔదార్యం అక్కడితో ఆగిపోలేదు. మానవాళితో పాటు తీవ్రంగా నష్టపోయిన జంతుజాలాన్ని ఆదుకునేందుకు పూనుకున్నారు. ఈ క్రమంలో పరిసరాల్లో ఉన్న కుక్కలకు.. ఇంకొన్ని జంతువులకు వైద్య సహాయం అందించనున్నారు.