
హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా ప్రపంచకప్ 2018 టోర్నీ నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ జర్మనీ పేలవ రీతిలో నిష్క్రమించింది. ఈ ఓటమితో కుంగిపోయిన జర్మనీ అభిమానులకి ఆ కలెక్టర్ చేసిన ట్వీట్ పుండు మీద కారం జల్లినట్లు అయింది. అతను మాద్యమంగా వాడిన ఫేస్బుక్నే వాడుకుని వాళ్లూ ఎదురుదాడికి దిగి తిట్టిపోశారు.
కేరళలోని కన్నూర్ జిల్లా కలెక్టర్ మీర్ మొహ్మద్ అలీ ఫేస్బుక్లో పోస్ట్ ద్వారా కోపం తెప్పించారు. కేరళలో ఫుట్బాల్ అభిమానులు ఎక్కువ. ఫిఫా ప్రపంచకప్ ఆరంభానికి ముందు నుంచే తమ అభిమాన జట్టుకి మద్దతు తెలుపుతూ అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టారు. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన జర్మనీ జట్టు నాకౌట్ రేసులో నిలవాలంటే బుధవారం రాత్రి దక్షిణ కొరియాతో మ్యాచ్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి.
కానీ.. పేలవ ప్రదర్శనతో అనూహ్యంగా జర్మనీ 0-2 తేడాతో ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించక తప్పలేదు. దీంతో.. కన్నూర్లో ఏర్పాటు చేసిన జర్మనీ ఫ్లెక్సీలు తొలగించాల్సిందిగా అభిమానులకి కలెక్టర్ సూచించారు. ఫుట్బాల్ అభిమానులకి సూచించినట్లే.. స్థానిక రాజకీయ నాయకులకి కూడా ఫ్లెక్సీలు తొలగించమని చెప్పగలరా..? అని కొంత మంది ప్రశ్నిస్తుండగా.. మరికొందరు కలెక్టర్కి మద్దతుగా నిలుస్తున్నారు.
అసలేం జరిగింది:
'జర్మనీ అభిమానులందరూ స్వచ్ఛందంగా జట్టుని పొగుడుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలి' అని మొహమ్మద్ అలీ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం మొహమ్మద్ అలీ ఇటీవల తీసుకున్న ప్లాస్టిక్ నిషేధ నిర్ణయం అతడికి మంచి పేరు తీసుకొచ్చింది. అయితే.. అనూహ్యంగా జర్మనీ అభిమానులకి అతను చేసిన సూచనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.