గౌహతి: ప్రముఖ బాలీవుడ్ నటుడు, ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి యజమాని జాన్ అబ్రహం.. అసోం ముఖ్యమంత్రి సర్బానంద సొనోవాల్తో సమావేశం అయ్యారు. ఐఎస్ఎల్ మూడో ఎడిషన్ వచ్చే నెల ఒకటో తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకున్నది.
వీరి మధ్య ఐఎస్ఎల్ ప్రారంభోత్సవం గురించి చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. ఐఎస్ఎల్ ప్రారంభోత్సవానికి తీసుకుంటున్న చర్యలను సోనోవాల్కు జాన్ అబ్రహం వివరించారని ఓ అధికార ప్రకటనలో తెలిపారు.

గౌహతిలోని సరూసజాజీ స్టేడియంలో ఐఎస్ఎల్ మూడో ఎడిషన్ అంగరంగ వైభవంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫుట్బాల్ కార్నివాల్ ప్రారంభోత్సవం కోసం అవసరమైన సహకారం, అధికార యంత్రాంగం మద్దతునిస్తామని జాన్ అబ్రహంకు సీఎం సర్బానంద సొనోవాల్ హామీ ఇచ్చారు.
భారత జాతీయ ఫుట్బాల్ అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాల భాగస్వామ్యం, దేశంలో ఫుట్బాల్ శక్తిమంతమైన ఆటగా మార్చేందుకు గల అవకాశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఐఎస్ఎల్ ధమాకా త్వరలో ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే.