ఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడో సీజన్ను ప్రేక్షకులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించనున్నారు. నవంబర్ నుంచి మార్చి వరకు ఐఎస్ఎల్ లీగ్ జరగనుంది. ఇక ఐదు నెలల పాటు సాకర్ అభిమానులు పండగ చేసుకోనున్నారు ఐఎస్ఎల్ ఏడో సీజన్ ఆతిథ్య రేసులో గోవా, కేరళ ముందున్నాయి. మరి రెండింటిలో ఆతిథ్యం ఏ రాష్ట్రంకు దక్కుతుందో చూడాలి. గత సీజన్ ఐదు నెలలుగా ఫుట్బాల్ అభిమానులను అలరించింది.
మరోవైపు విదేశీ ఆటగాళ్ల నిబంధనలో ఐఎస్ఎల్ స్వల్ప మార్పులు చేసింది. 2021-22 సీజన్ నుంచి విదేశీ ఆటగాళ్ల సంఖ్యను 3+1కు తగ్గించింది. ప్రస్తుత నిబంధన ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ ఏడుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. గరిష్టంగా ఐదుగురు మ్యాచ్లో ఆడొచ్చు. సవరించిన నిబంధన ప్రకారం.. ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఆరుగురు విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. అందులో ఓ ఆసియా ఆటగాడు కచ్చితంగా ఉండాలి. మైదానంలో బరిలో దిగే నలుగురు విదేశీయుల్లో ఆసియా ఆటగాడు తప్పనిసరి.
కొవిడ్-19 కారణంగా ఐఎస్ఎల్ ఆరో సీజన్ ఫైనల్ మ్యాచ్ ఖాళీ కుర్చీల మధ్య జరిగింది. ఏటీకే, చెన్నయిన్ ఎఫ్సీ జట్లు మూడో టైటిల్ కోసం పోటీపడ్డాయి. ఏటీకే మూడో టైటిల్ సాధించింది. ఏటీకే 2014, 16, 19లో టైటిల్ నెగ్గితే.. చెన్నయిన్ 2015, 18లో ట్రోఫీ చేజిక్కించుకుంది. గత సీజన్లో కూడా ప్రేక్షకులను అనుమతించకుండా రెండు మ్యాచ్లు నిర్వహించారు. అందులో ఒకటి ఫైనల్ మ్యాచ్ ఉంది.
ఫైనల్ మ్యాచ్ కంటే ముందు నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సీ, బెంగళూరు ఎఫ్సీ మధ్య గువాహటి వేదికగా జరుగాల్సిన మ్యాచ్కు కూడా అభిమానులను అనుమతించలేదు. అప్పట్లో పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలో తీవ్ర నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో తలుపులు మూసి మ్యాచ్ నిర్వహించారు. గత సీజన్లో ఇండియన్ సూపర్ లీగ్లో హైదరాబాద్ ఎఫ్సీ జట్టు పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
స్పెషల్ బర్త్ డే గిప్ట్.. 'ఎంఎస్ ధోనీ నెంబర్ 7' సాంగ్ రిలీజ్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్!!