కోల్కతా: అట్లెటికో డీ కోల్కతాతో శనివారం జరిగే ఐఎస్ఎల్ సెమీ ఫైనల్స్ మ్యాచ్ విభిన్నమైన టోర్నీ వంటిదని ముంబై సిటీ ఎఫ్సి సారధి డియాగో ఫోర్లాన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుత సీజన్లో టాప్ 4లో మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్న ముంబై సిటీ సారధిగా శనివారం కొత్త టోర్నమెంట్ మొదలవుతుందని ఇష్టాగోష్టిగా జరిగిన మీడియా రౌండ్ టేబుల్ సమావేశంలో వ్యాఖ్యానించాడు.
లీగ్ దశలో టాప్కు చేరుకోవడం తమలో విశ్వాసం పెంపొందించుకునేందుకు మంచి పరిణామమేనని అన్నాడు. టోర్నమెంట్లో తాము మంచి పొజిషన్లో ఉన్నామని తెలిపాడు. అట్లెటికో డీ కోల్కతాలో కొందరు విదేశీ ఆటగాళ్లు ఉన్నారని, వారు లా లీగలో హెవీ వెయిట్స్ వంటి వారన్నాడు. వారి గురించి తనకు తెలుసునని, అట్లెటికో డీ కోల్కతా వంటి మంచి టీంతో మ్యాచ్ ఆడనున్నామన్నాడు. ప్లేయర్లు ఎల్లవేళలా క్వాలిటీ కలిగి ఉండరని, అయితే ఆత్మ విశ్వాసాన్ని బట్టే అది ఉంటుందన్నాడు.
ఫోర్లాన్ ను నిలువరించేందుకు ప్లాన్లేమీ లేవు: మొలీనా
తమ జట్టుపై అండర్ డాగ్స్ అన్న ముద్ర వేస్తే ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని అట్లెటికో డీ కోల్ కతా చీఫ్ కోచ్ జోస్ మొలీనా వ్యాఖ్యానించాడు. జట్టు సభ్యుల్లో నమ్మకం ముఖ్యమని చెప్పాడు. తాము ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నామా? లేదా? అన్న విషయం తాను ఆలోచించడం లేదన్నాడు. ఈ ఆలోచనలతో తన నిద్ర చెడగొట్టుకోవడం ఇష్టం లేదన్నాడు.

తాము మెరుగైన ఆటతీరు ప్రదర్శనతో జట్టును ఫైనల్స్ వరకు తీసుకెళ్లడమే తమ ముందు ప్రస్తుతం ఉన్న లక్ష్యమని చెప్పాడు. ముంబై సిటీ ఎఫ్సి సారధి డియాగో ఫోర్లాన్ వంటి కీలక ఆటగాళ్లను ఎదుర్కొనేందుకు తాము ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదని మొలీనా వ్యాఖ్యానించాడు.
'ఆయన కోసం ప్రత్యేకమైన ప్రణాళికేమీ లేదు. పిచ్ పై ఫోర్లాన్ ఒక్కడే ఆడడు. ఆయనతోపాటు పది మంది ఆటగాళ్లు ఉంటారు. అప్పుడు మేం ఒక టీంను ఎదుర్కోవాలే గానీ, ఒక వ్యక్తిని కాదు. ఒకవేళ వారు శక్తిమంతమైన ప్లేయర్లు అయినా మేం వారిని ఎదుర్కొంటాం' అని మొలీనా అన్నాడు.
తమ జట్టు లీగ్ దశలో 14 మ్యాచ్ ల్లో ఎనిమిదింటిని డ్రాగా ముగించిందని, కానీ ముంబై జట్టు ఒక్క మ్యాచ్ కూడా డ్రా చేసేందుకు ఆడలేదన్నాడు. కనుక వారు శనివారం కోల్కతాలోని రవీంద్ర సారోబార్ స్టేడియంలో జరిగే సెమీ ఫైనల్స్ మ్యాచ్ లోనూ ముంబై జట్టు గెలుపొందేందుకు ప్రాధాన్యం ఇస్తూ బరిలోకి దిగుతుందన్నాడు. అర్నాబ్ మొండాల్ మాత్రమే కొద్దిగా సమస్యతో బాధపడుతున్నాడని, మిగతా ప్లేయర్లంతా మంచిగానే ఉన్నారన్నాడు.
ముంబై విజయమే కీలకమన్న గుమారిస్
తొలిసారి సెమీ ఫైనల్స్ మ్యాచ్ ఆడుతున్న ముంబై సిటీ ఎఫ్ సి జట్టు హెడ్ కోచ్ అలెగ్జాండ్రీ గుమారెస్ తమ జట్టుకు ఫేవరెట్ ట్యాగ్ తగిలించొద్దన్నాడు. తాము తొలిసారి సెమీస్ బరిలోకి దిగామన్నాడు. ఇప్పటికే రెండుసార్లు అట్లెటికో డీ కోల్కతా జట్టు సెమీస్ వరకు దూసుకువచ్చిందని గుమారెస్ గుర్తుచేశాడు.
తొలి సెమీ ఫైనల్స్ మ్యాచ్ కోసం తామంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెప్పాడు. ప్రత్యర్థి జట్టుపై దూకుడుగా ఆడటానికే తాము ప్రాధాన్యం ఇస్తామని చెప్పాడు. ముంబైలో జరిగే రెండో సెమీ ఫైనల్స్ ఫలితం ఆధారంగానే తదుపరి దశ మ్యాచ్ ఉంటుందన్నాడు.
ప్రస్తుత దశలో జట్టుకు గుర్తింపు తీసుకు రావడమే ప్రాధాన్యం అన్నాడు. తమ జట్టు పూర్తి విశ్వాసంతో, స్థిరమైన పెర్పార్మెన్స్ కలిగి ఉన్నామని చెప్పాడు. అటాకింగ్ విభాగానికి సారధి డియాగో ఫోర్లాన్, డిఫెన్స్ విభాగానికి లుసియాన్ గోయాన్ ముందు వరుసలో నిలుస్తారన్నాడు. అత్యంత ప్రతిభావంతులైన ఆటగాళ్లను ముందు వరుసలో నిలబెడ్తామన్నాడు.