కోల్కతా: ఐఎస్ఎల్ 3వ ఎడిషన్ టోర్నీలో నాణ్యతా ప్రమాణాలు దిగజారాయని ఫుట్ బాల్ ఇండియా మాజీ కెప్టెన్ భాయిచుంగ్ భూటియా అంగీకరించాడు. 'ఈ ఏడాది గణాంకాలు పరిశీలిస్తే గత ఏడాది ఫలితాలు, గోల్స్తో పోలిస్తే గోల్స్ 37 తగ్గాయి. ప్లేఆఫ్ దశకు చేరుకునే సరికి గతేడాది ఎక్కువ గోల్స్ రికార్డయ్యాయి' అని చెప్పాడు.
'జట్లన్నీ దాదాపు డిఫెన్సివ్ వ్యూహం అనుసరించాయి. ఇండియన్ ప్లేయర్ల ప్రతిభ పెంపొందించుకోవడంలోనూ ఇది కనిపించింది. ఈ సారి కూడా ఇండియన్లు అత్యధిక గోల్స్ చేయకపోవడం భారత్ ఫుట్ బాల్ క్రీడకు మంచిది కాదు' అని అన్నాడు. గత ఏడాది అట్లెటికో డీ కోల్కతా జట్టుకు కన్సల్టెంట్గా భూటియా వ్యవహరించాడు.
ఈ ఏడాది అట్లెటికో డీ కోల్కతా జట్టులో ఒక భారతీయ ఆటగాడు కూడా గోల్ చేయలేదు.గత ఏడాది చెన్నయిన్ (ఎఫ్సి)తో జరిగిన మ్యాచ్లోనే అత్యధిక గోల్స్ జరిగాయన్నాడు. ఈ ఏడాది వివిధ జట్ల కోచ్లు మ్యాచ్ లు ఓడిపోవడానికి ఇష్టపడలేదని, దానికి నిదర్శనం అత్యధిక మ్యాచ్ల ఫలితాలు డ్రాగా ముగియడమేనన్నాడు.

వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐ - లీగ్ నుంచి గోవా క్లబ్ జట్లు మూడు వైదొలగడం బాధాకరమని, ప్రత్యేకించి గతేడాదే రంగ ప్రవేశం చేసిన డెంపో ఎఫ్ సి వైదొలగడం ఇబ్బందకరంగా ఉన్నదన్నాడు. మూడు జట్లు వైదొలిగినా తెలివిగా వ్యవహరిస్తున్న ఇతర జట్లు ఐ - లీగ్లో చేరి తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాయన్నాడు.
ఐఎస్ఎల్ టోర్నీలో ఎఫ్ సి గోవాకు మాదిరిగానే గోవా అభిమానులు మిగతా జట్లకు కూడా మద్దతునివ్వాలని కోరాడు. ప్రతిపాదిత ఐఎస్ఎల్, ఐ-లీగ్ టోర్నీల విలీనం వల్ల భారత్లోని ప్రతి క్లబ్ జట్టు పాల్గొనేందుకు అవకాశం లభిస్తుందని, తద్వారా భారత ఫుట్బాల్ అత్యున్నత స్థాయికి చేరుకుంటుందన్నాడు.
అన్ని పక్షాల వారిని కలుపుకుని ఐ లీగ్, ఐఎస్ఎల్ టోర్నీలను విలీనం చేస్తారన్నాడు. ఈస్ట్ బెంగాల్, మొహున్ బగన్ క్లబ్ జట్లను విలీనం తర్వాత ఏర్పాటుచేసే టాప్ ఫార్మాట్లో నిలపాలన్నారు. ఐఎస్ఎల్ టాప్ టోర్నీగా ఉండటంతోపాటు ఐ-లీగ్ తదుపరి స్థానాన్ని దక్కించుకుంటుందని చెప్పాడు.
కలకత్తా ఫుట్బాల్ లీగ్లో తాను ఆడిన రోజులను భూటియా గుర్తుచేసుకున్నాడు. తన కెరీర్లోనే కలకత్తా లీగ్ అత్యుత్తమమైందని అన్నాడు. ఈ విషయమై పోలికే అక్కర్లేదన్నాడు. ఐఎస్ఎల్, ఐ - లీగ్ల నిర్వహణ వల్ల స్థానిక లీగ్లపై ప్రభావం చూపుతుందన్నాడు. అదెలాగో తాను చెప్పలేనన్నాడు.
భారత్లో వచ్చే ఏడాది యు-17 వరల్డ్ కప్ నిర్వహించడం వల్ల ప్రతిభావంతులైన కొందరు ప్లేయర్లలో ఉన్న ప్రతిభ వెలుగుచూసే అవకాశమున్నదని అన్నాడు. ఈ టోర్నీ నిర్వహణకు అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్), భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) ఏర్పాట్లు గొప్పగా ఉన్నాయన్నాడు.
ఎఐఎఫ్ఎఫ్, సాయ్ గొప్ప మౌలిక వసతులు కల్పిస్తున్నాయని తెలిపాడు. భారత ఫుట్ బాల్ జట్టు హెడ్ కోచ్ గా బాద్యతలు స్వీకరించిన నికొలయి ఆడం కేవలం జట్టును శక్తిమంతంగా తీర్చిదిద్దడంతో మాత్రమే సంత్రుప్తి చెందడం లేదని, తాను అదే అభిప్రాయంతో ఉన్నానన్నాడు.
రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు జరిగినప్పుడు ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశమున్నదని తెలిపాడు. 'ఒకవేళ మనం మంచి పెర్పార్మెన్స్ తో కూడిన వసతులు కల్పిస్తే మంచి టీం వస్తుంది. యు - 17 వరల్డ్ కప్ టోర్నీలో ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి. వాయ్నే రూనీ ఎవర్టెన్ కు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్ ల్లో 16 గోల్స్ సాధించాడు' అని గుర్తుచేశాడు. కుర్రాళ్లకు శిక్షణ ఇవ్బడం చాలా కష్టతరమైన పని అన్నాడు.