
హైదరాబాద్: అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నీలో తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన కేరళ బ్లాస్టర్స్ ఐఎస్ఎల్-4వ సీజన్ ఆరంభ మ్యాచ్లో ఆకట్టుకుంది. శుక్రవారం కోల్కతా-కేరళ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది.
కోచ్చిలోని జవహార్ లాల్ నెహ్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే ఇరుజట్ల ఆటగాళ్లు అటాకింగ్తో అలరించినప్పటికీ నిర్ణీత సమయంలో ఒక్క గోల్ కూడా చేయలేకోపోయారు. రెండు జట్లూ రక్షణాత్మకంగా ఆడటంతో మ్యాచ్లో పెద్దగా గోల్ సాధించే అవకాశాలు కూడా రాలేదు.
మధ్యలో కోల్కతాకు ఒకటి, రెండు అవకాశాలు వచ్చినా.. కేరళ డిఫెన్స్ అద్భుతంగా అడ్డుకుంది. కేరళ డిఫెండర్ నెమాంజ పదేపదే ప్రత్యర్థి సర్కిల్లోకి చొచ్చుకుపోయినా గోల్స్ సాధించడంలో విఫలమైంది. గత మూడు సీజన్లుగా కోల్కతా బయట వేదికలో ఆడిన తొలి మ్యాచ్ డ్రాగా ముగియడం ఇదే తొలిసారి.
గత మూడు సీజన్లలోనూ సొంతగడ్డ బయట జరిగిన మ్యాచ్ల్లో ఆ జట్టు విజయం సాధించింది. ఈ సీజన్లోనే కేరళ తరఫున ఐఎస్ఎల్లో అరంగేట్రం చేసిన మాంచెస్టర్ యునైటెడ్ మాజీ స్ట్రైకర్ బెర్బటోవ్ ఆకట్టుకోలేకపోయాడు. కాగా, మ్యాచ్కు ముందు ఐపీఎల్ 4వ సీజన్ ఆరంభం వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
బాలీవుడ్ తారలు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ తమ ఆటపాటలతో అలరించారు. మళయాల నటుడు మమ్ముట్టి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఐఎస్ఎల్ చైర్మన్ నీతా అంబానీ, కేరళ ఫ్రాంచైజీ సహ యజమానిగా ఉన్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వేడుకల్లో సందడి చేశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.