కోల్ కతా: సారధి హెల్డర్ పొస్టిగకు అయిన గాయంపై అట్లెటికో డీ కోల్ కతా ఫ్రాంచైసీ యాజమాన్యం ఆందోళనతో ఉంది. రియల్ మాడ్రిడ్ ఫేమస్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కలిసి మ్యాచ్ల్లో పాల్గొన్న పొస్టిగ గాయం కారణంగా జట్టు తరఫున ఆడలేకపోతున్నాడు. గత ఏడాది సీజన్ లోనూ ఒకే ఒక మ్యాచ్ మాత్రమే ఆడాడు.
అతని శరీరంలోని కింది భాగంలో అయిన గాయంతో పొస్టిగ ఈ సీజన్ లోనూ ఒక మ్యాచ్ లో పూర్తిగా, మరో మ్యాచ్ లో సగంలోనే వైదొలగాల్సి వచ్చింది. కేరళ బ్లాక్ బస్టర్స్ తో జరిగిన మ్యాచ్ మధ్యలోనే పక్కకు తప్పుకున్న పొస్టిగకు కనీసం మరో మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చేశారు.
ఆదివారం ఎఫ్ సి గోవా తరఫున జరిగిన మ్యాచ్ లో పొస్టిగ తన ఫ్రాంచైసీ సహ యజమాని సౌరబ్ గంగూలీ, ఇతర అధికారులతోపాటు విఐపి బాక్సులో కూర్చుని ఆటతీరును గమనించడానికే పరిమితమయ్యాడు. తన ఆరోగ్య పరిస్థితిపై పొస్టిగ స్పందిస్తూ సాధ్యమైనంత త్వరగా గ్రౌండ్ లోకి రావడానికే ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

గాయం మానక పోవడంతో మరో మూడు మ్యాచ్ లకూ ఆయన దూరమే. ఆ మూడింటిలో ఢిల్లీ డైనమోస్తో జరిగే మ్యాచ్.. కోల్ కతాకు అత్యంత కీలకం. సుదీర్ఘ కాలం గాయంతో బాధపడుతున్న పొస్టిగ పరిస్థితి గురించి కోల్ కతా ఫ్రాంచైసీ అధికారులు, యాజమాన్యం అసంతృప్తితో ఉంది.
సుదీర్ఘ కాలంగా గాయం వెంటాడుతున్నందున తమ యాజమాన్యం సారధిగా పొస్టిగ కాంట్రాక్టును పునరుద్ధరించేందుకు సిద్ధంగా లేదని క్లబ్ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది పరిస్థితిని తాము అర్థంచేసుకోగలమని, కానీ పొస్టిగనే సారధిగా నియమించుకున్నందున ఈ సీజన్ లో మరో ప్లేయర్ ను నియమించుకునేందుకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తున్నదన్నాడు.
నాలుగు మ్యాచ్ లకు మూడింట ఎటికె మ్యాచ్ లను డ్రా చేసుకోవడంపై జట్టు కోచ్ జోస్ మొలీనా ఒకింత అసంత్రుప్తితో ఉన్నారని సమాచారం. స్కోర్ సాధించేందుకు పోస్టిగను ఫార్వర్డ్ లైన్ లో ముందుకు తేవాల్సిందేనని ఫ్రాంచైసీ యాజమాన్యంతో మొలీనా అన్నట్లు తెలుస్తున్నది.
మెరుగు పడిన ఇండియన్ ఫుట్ బాల్: రైస్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ ఫుట్ బాల్ పరిస్థితి మెరుగు పడిందని డిఫెండింగ్ చాంపియన్ చెన్నైయిన్ సారధి జాన్ ఆర్నె రైస్ వ్యాఖ్యానించాడు. తన ఫుట్ బాల్ కెరీర్ లోనూ, ఫేవరేట్ టీమ్ మెట్స్ లోనూ ఐఎస్ఎల్ చిరస్మరణీయంగా గుర్తుండిపోతుందని 'వన్ ఇండియా' వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.
గతేడాది భారత్ లో ఏముందో తనకు తెలియదన్నాడు. కానీ ఈ సీజన్ కు వచ్చే సరికి ఆటలోనూ, ఐఎస్ఎల్ లోనూ అన్ని విధాలుగా మెరుగైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నాడు. ప్రత్యేకించి భారత ఫుట్ బాల్ ప్లేయర్ల క్వాలిటీ మెరుగైందని చెప్పాడు. ఐఎస్ఎల్ లీగ్ లో కొందరు బెస్ట్ భారతీయ ఆటగాళ్లు ఉండడం తమకు చాలా లక్కీ అని చెప్పారు. వాడో చాలా అనుభవం కలిగిన క్రీడాకారుడని, తనను ఆకట్టుకున్నాడని చెప్పారు.
ఈ ఏడాది ఫస్ట్ గేమ్ లో బాగానే ఆడామని, కానీ మ్యాచ్ డ్రా ముగించడం అసంత్రుప్తి మిగిల్చిందన్నాడు. ఢిల్లీ డైనమోస్ తో జరిగిన మ్యాచ్ తమకు చాలా చెడుపేరు తెచ్చి పెట్టిందన్నారు. ఐఎస్ఎల్ 3 ఎడిషన్ లో జట్ల మధ్య పోటాపోటీ పరిస్థితులు ఉన్నాయని తమ కుర్రాళ్లు వాస్తవిక అంచనాకు వచ్చారని తెలిపాడు. గోవాతో జరిగిన మ్యాచ్ లో వ్యూహాత్మకంగా తమ జట్టు దూకుడుగా ఆడి మెరుగైన ఆటతీరు ప్రదర్శించిందన్నారు.
వరుసగా మూడేళ్లుగా ఈ లీగ్ జరుగుతున్నా.. గత 10 ఏళ్లలో అత్యధికులు వీక్షించిన లీగ్ ఇదేనన్నారు. అభిమానులు మరింత పెరుగాల్సిన అవసరం ఉన్నదని, నేషనల్ టీంను చక్కదిద్దుకోవాల్సి ఉందన్నారు. అత్యంత నైపుణ్యం గల ఆటగాళ్లను ఆకర్షించాల్సి ఉన్నదని రైస్ వివరించాడు.
అలాగే సుదీర్ఘ కాలం లీగ్ కొనసాగించాల్సి అవసరం ఉందని తెలిపాడు. దానివల్ల ఆటలో క్వాలిటీ పెరుగుతుందని చెప్పాడు. తనతోపాటు ఆడిన స్టీవెన్ గెర్రాడ్, ఫ్రాన్సెస్కో టొట్టి ఉత్తమ ఆటగాళ్లని, ప్రస్తుత సీజన్ లో లియానెల్ మెస్సీ బెస్ట్ ప్లేయర్ అని పేర్కొన్నాడు.