హైదరాబాద్: కళ్లు చెదిరే ఫ్రీ కిక్లు.. కళాత్మకమైన పాస్లు.. మతి పోగొట్టే హెడర్స్.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే డిఫెండర్ల విన్యాసాలు.. వెరసి ప్రేక్షకుల్ని అలరించడానికి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఏడవ సీజన్ సిద్ధమైంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కట్టుబాట్ల నడుమ బుడగలో కాలికి, బంతికి జరిగే ఈ పోరాటంలో గెలిచేందుకు 11 జట్లు సిద్ధమయి మనల్ని ఉత్సాహపరిచేందుకు ఫుట్బాల్ పండుగను తీసుకొచ్చాయి. కొద్ది నిమిషాల క్రితం ప్రారంభం అయిన కేరళ బ్లాస్టర్స్, ఏటీకే మోహన్ బగాన్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది.
క్వారంటైన్ నిబంధనలు ఉండటంతో టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు నెల రోజులు ముందుగానే గోవాకు చేరుకున్నారు. ఇక టైటిల్ కోసం పోటీ పడే జట్ల సంఖ్య ఈ సారి పెరిగింది. లీగ్లోకి కొత్తగా స్పోర్టింగ్ క్లబ్ ఈస్ట్ బెంగాల్ వచ్చి చేరడంతో... జట్ల సంఖ్య 11కు చేరింది. టైటిల్ ఫేవరెట్లుగా డిఫెండింగ్ చాంపియన్ ఏటీకే మోహన్ బగాన్, మాజీ చాంపియన్ బెంగళూరు ఎఫ్సీ కనిపిస్తున్నాయి.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా) ప్రతిపాదించిన ఐదుగురు సబ్స్టిట్యూట్ నిబంధన ఐఎస్ఎల్ 2020లో కూడా కొనసాగనుంది. దాంతో మ్యాచ్ మధ్యలో ఒక జట్టు గరిష్టంగా ఐదుగురు సబ్స్టిట్యూట్లను ఆడించవచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మూడు సందర్భాల్లో మాత్రమే వీరిని బరిలోకి దించాలి. అంతేకాకుండా సబ్స్టిట్యూట్ బెంచ్ను ఏడుగురి నుంచి తొమ్మిదికి పెంచారు. ఇది అన్ని జట్లకు కలిసిరానుంది.
రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిన జరిగే ఈ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీ ఫైనల్స్ జరుగుతాయి. కరోనా ఉండటంతో ఈ సారి ఇంటా, బయట పద్ధతిలో కాకుండా.. ఒకే చోట సెమీస్ మ్యాచ్లు జరుగుతాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఇప్పటి వరకు లీగ్ తొలి అంచె మ్యాచ్ తేదీలను మాత్రమే నిర్వాహకులు ప్రకటించారు. డిసెంబర్లో రెండో అంచె పోటీలతో పాటు సెమీస్, ఫైనల్ తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.
రైనా బ్రో.. నా కోసం వంట చేస్తున్నావా: ఇర్ఫాన్