పుణె: వచ్చే మూడు లీగ్మ్యాచ్ల్లోనూ గెలుపొంది ఐఎస్ఎల్ 3 ఎడిషన్లో సెమీ ఫైనల్లో చోటు దక్కించుకునే లక్ష్యంతో పుణె సిటీ ముందుకు సాగుతున్నది. ఆలస్యంగా తొలి విజయాన్ని నమోదుచేసినా తాజాగా బుధవారం సొంతగడ్డపై శ్రీశివ్ ఛత్రపది స్పోర్ట్&్స కాంప్లెక్స్ స్టేడియంలో నార్త్ఈస్ట్ యునైటెడ్ జట్టుతో తలపడనున్నది.
ఈ నెల17న కేరళ బ్లాక్బస్టర్స్, 23న చెన్నైయిన్తో జరిగే మ్యాచ్ల్లో సాధ్యమైనంత ఎక్కువ పాయింట్లు సాధించదమే తమ లక్ష్యమని ఫుణె అసిస్టెంట్ కోచ్ మిగౌల్ వ్యాఖ్యానించారు. 'మేం సొంతగడ్డపై మూడు మ్యాచ్లు ఆడతాం. తొమ్మిది పాయింట్లు పొందాలంటే ఈ మ్యాచ్లు మాకు కీలకం. అప్పుడే సెమీ ఫైనల్లో అర్హత సాధించగలం. నార్త్ఈస్ట్ జట్టు చాలా మంచి ఫామ్లో ఉంది.
తొలి మ్యాచ్లో నార్త్ఈస్ట్తో ఓడిపోయినా.. తాజా మ్యాచ్ మా సొంతగడ్డపై జరుగుతున్నది. గోవాపై విజయం తర్వాత మా జట్టులో విశ్వాసం పెరిగిపోయింది' అని మిగౌల్ తెలిపారు. నాలుగు మ్యాచ్ల నిషేధంతో మరో రెండు మ్యాచ్ల వరకు హెడ్ కోచ్ అంటోనియో హబాస్ పరోక్షంలో మిగౌల్ కోచ్గా బాధ్యతలు నిర్వహించనున్నాడు.
'గోవాపై జరిగిన మ్యాచ్లో విజయం మా కుర్రాళ్లలో ఉత్సాహాన్ని నింపింది. మిడ్ఫీల్డర్ జొన్నాథన్ లుక్కా తదితరుల ఆల్రౌండ్ ప్రతిభతో సారధి మహ్మద్ సిస్సోకో మ్యాచ్పై చెరగని ముద్రవేశాడు. తొలిసారి జట్టు సమిష్టిగా ఆడి విజయం సాధించింది. ఆటలో స్పందన కంటే ఆటగాళ్లు పరస్పరం అవగాహన పెంచుకున్నారు' అని మిగౌల్ తెలిపారు.
ముంబై సిటీతో జరిగిన తొలి మ్యాచ్లో పొరపాటున ఓటమి పాలయ్యామని మిగౌల్ వ్యాఖ్యానించాడు. కానీ గోవాపై జరిగిన మ్యాచ్లో పుంజుకున్నట్లు తెలిపాడు. తొలి మ్యాచ్లో గోల్ సాధించలేకపోయామని జట్టు సభ్యుల్లో ఉన్న అసంతృప్తి.. రెండో మ్యాచ్లో దూకుడుగా వ్యవహరించేందుకు దోహద పడిందని అన్నాడు. ప్రారంభం నుంచి చివరి వరకు పాజిటివ్ దృక్పథంతో ఆడుతూ దూకుడుగా వ్యవహరిస్తామన్నాడు.
పుణెలో సొంత అభిమానుల మద్దతు తమకు కీలకమని మిగౌల్ వ్యాఖ్యానించాడు. పుణె మిడ్ఫీల్డర్ రాహుభెకే మాట్లాడుతూ విదేశీ ఆటగాళ్లు ఆడటం చాలా ముఖ్యమని, వారు తమకు సీజన్ అంతా ఎలా ఆడాలో నేర్పుతూ సహకరిస్తున్నారని చెప్పాడు. సిస్సోకో చాలా అనుభవజ్ఞుడని, ఆయన వచ్చాక తమలో బలం, శక్తి సామర్థ్యాలు పెరిగిపోయాయని అన్నాడు.

నార్త్ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి జట్టును ముంబై జట్టు మట్టి కరిపించింది. దీంతో నార్త్ఈస్ట్ కోచ్ నెలో వింగాడ మదిలో ప్రత్యామ్నాయ వ్యూహాలు మొదలయ్యాయి. కేవలం సొంతగడ్డపై విజయాలతోనే ముందుకు వెళ్లలేమని గ్రహించిన వింగాడ ఇతర ప్రదేశాల్లోనూ విజయంపై దృష్టి సారించాడు.
ముంబైపై జరిగిన మ్యాచ్లో నార్త్ఈస్ట్ తాను గోల్చేసేందుకు వచ్చిన అవకాశాలను మిస్చేసి.. చివరకు డ్రా చేసే అవకాశాలు కూడా లేకుండా చేసుకున్నది. తదుపరి దశలో ముందుకు వెళ్లాలంటే ఒకటికంటే ఎక్కువ పాయింట్లతోనే సాధ్యం. అలాగానీ పక్షంలో విలాసాలకు తెర పడినట్లే.
పుణెతో జరిగే మ్యాచ్ తమకు కష్టసాధ్యమేనని నార్త్ఈస్ట్ కోచ్ వింగాడ అంగీకరించాడు. అయినా బుధవారం జరిగే మ్యాచ్లో తమ జట్టు కష్టాలను ఎదుర్కొని మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాడు.
పుణె జట్టు చాలా మంచిదని, గోవా జట్టుతో మంచి ఫలితం సాధించిందని వింగాడ ప్రశంసించాడు. తాము అదే స్థాయికి దూసుకెళ్లాలంటే తమ జట్టుకు వచ్చిన అవకాశాలను గోల్స్గా మార్చుకోవాల్సి ఉంటుందన్నాడు. ఏ దేశంలోనైనా షెడ్యూల్ ప్రకారం ముందుకు వెళ్లాల్సిందేనన్నాడు.
లీగ్ టోర్నీ చాలా బాగా ఉందని, అయితే పరిస్థితులకు అనుగుణంగా మెరుగ్గా ఆడాలని తన జట్టు సభ్యులకు ఉద్బోధించాడు. తాను కోచ్గా వ్యవహరించడం లేదని, ఈ లీగ్ తమకు చాలా ప్రత్యేకమన్నాడు. బుధవారం జరిగే మ్యాచ్కు జట్టులో రెండు స్వల్ప మార్పులు ఉంటాయని వివరించాడు.