బాంబోలిమ్ (గోవా): ఎనిమిది నెలల విరామం తర్వాత దేశంలో తిరిగి క్రీడా సందడి మొదలైంది. కరోనా మహమ్మారి విరామం అనంతరం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) రూపంలో మెగా టోర్నీ ప్రారంభమైంది. ఈ సీజన్లో ఏటీకేతో జతకట్టి తొలిసారిగా అడుగుపెట్టిన మోహన్ బగాన్ విజయంతో టోర్నీని ఆరంభించింది. శుక్రవారం జరిగిన ఏడో సీజన్ తొలి మ్యాచ్లో ఏటీకే మోహన్ బగాన్ 1-0 తేడాతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీని ఓడించి శుభారంభం చేసింది. కెప్టెన్ రాయ్ కృష్ణ (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు.
తొలి మ్యాచ్ కావడంతో రెండు జట్లు కాస్త రక్షణాత్మక ధోరణిలో ఆడాయి. మ్యాచ్ సాగుతున్నా కొద్ది హోరాహోరీగా తలపడడంతో తొలి అర్ధ భాగంలో గోల్స్ నమోదు కాలేదు. విజయం కోసం గట్టిగా ప్రయత్నించిన జట్లు గోల్స్ చేసే అవకాశాలను తృటిలో చేజార్చుకున్నాయి. అయితే రెండో అర్ధ భాగంలో జోరు పెంచిన మోహన్ బగాన్ ఫలితం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి మంచి దూకుడు మీద కనిపించిన ఫార్వర్డ్ కృష్ణ గోల్తో ఆకట్టుకున్నాడు. అప్పటికే రెండు సార్లు గోల్స్ చేసే అవకాశం చేజారడంతో.. ఈ ప్రయత్నాన్ని వదులుకోవద్దనే పట్టుదలతో కనిపించిన అతను బంతిని అందుకోగానే దాన్ని గోల్కీపర్ కుడివైపుగా లోపలికి పంపించాడు.
చివరి వరకూ స్కోరు సమం చేసేందుకు కేరళ బ్లాస్టర్స్ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు మోహన్ బగాన్ 1-0 స్కోరుతో కేరళ బ్లాస్టర్స్పై విజయం సాధించింది. ఈ గెలుపుతో బగాన్కు మూడు పాయింట్లు లభించాయి. శనివారం జరిగే మ్యాచ్లో నార్త్ఈస్ట్ యునైటెడ్-ముంబై సిటీ తలపడతాయి. ఈ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా సాగనుంది.
కరోనా వైరస్ సంక్షోభ పరిస్థితుల్లో ఫుట్బాల్ను తిరిగి తెచ్చేందుకు ఎంతో ధైర్యం, అంకితభావం, ప్రణాళిక అవసరమయ్యాయని ఫుట్బాల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ (ఎఫ్ఎస్డీఎల్) ఛైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు. వచ్చే నాలుగు నెలలు ఈ ఐఎస్ఎల్ ఆనందాన్ని, ఉత్తేజాన్ని, సానుకూల దృక్పథాన్ని నింపుతుందనే నమ్మకంతో ఉన్నామని పేర్కొన్నారు.
కరోనా ఎఫెక్ట్.. సబ్స్టిట్యూట్ల సంఖ్య పెరిగింది!!